కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి సైలెంట్ ఎందుకయ్యాడు?

రేవంత్‌ అంటేనే రాజకీయాల్లో ఆయనో ఫైర్‌‌బ్రాండ్‌. అధికార పక్షంపై విమర్శలు చేయడంలోనూ.. అధికార పక్షాన్ని టార్గెట్‌ చేయడంలోనూ ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఆయన సీఎం కేసీఆర్‌‌పై ఎన్నో సార్లు విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సమస్యలపై నిలదీశారు. ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్‌లో జాయిన్‌ అయినప్పటి నుంచి కూడా తన నోటికి ఏనాడూ తాళం వేయలేదు. బాధ్యతలు అప్పజెప్పినా.. లేకున్నా పార్టీ కోసం పనిచేసేందుకు దూకుడుగా వెళ్తుంటారు. ఇప్పటివరకూ దుబ్బాక సహా అన్ని […]

Written By: Srinivas, Updated On : March 29, 2021 11:59 am
Follow us on


రేవంత్‌ అంటేనే రాజకీయాల్లో ఆయనో ఫైర్‌‌బ్రాండ్‌. అధికార పక్షంపై విమర్శలు చేయడంలోనూ.. అధికార పక్షాన్ని టార్గెట్‌ చేయడంలోనూ ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఆయన సీఎం కేసీఆర్‌‌పై ఎన్నో సార్లు విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సమస్యలపై నిలదీశారు. ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్‌లో జాయిన్‌ అయినప్పటి నుంచి కూడా తన నోటికి ఏనాడూ తాళం వేయలేదు. బాధ్యతలు అప్పజెప్పినా.. లేకున్నా పార్టీ కోసం పనిచేసేందుకు దూకుడుగా వెళ్తుంటారు. ఇప్పటివరకూ దుబ్బాక సహా అన్ని రకాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ కోసం చురుకుగా పోరాడారు.

గ్రేటర్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నీ తానై ప్రచారం చేశారు. ఇతర పార్టీ సీనియర్లెవరూ కన్నెత్తి చూడకపోయినా పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ గెలుపు కోసం అహర్నిషలు కృషి చేశారు. కానీ.. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఊపు వచ్చే సరికి రేవంత్ సైలెంటయ్యారు. ఆయన ఎక్కడా కనిపించడం లేదు. వారం రోజుల కిందట రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో ఆయనను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇక ఆయనను సాగర్ ఎన్నికల్లో ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది.

అయితే.. రేపో మాపో నెగెటివ్‌ వచ్చిన తర్వాత కూడా రేవంత్‌ సాగర్ వెళ్లి ప్రచారం చేయడమే కానీ.. ఉత్తమ్‌ నుంచో.. జానారెడ్డి నుంచో ఆహ్వానం అందే పరిస్థితి కనిపించడం లేదు. నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పోటీ నడుస్తోంది. రాజకీయ సమీకరణాల రీత్యా.. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి అడ్వాంటేజ్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా పెద్ద ఎత్తున జనం వస్తారని.. తర్వాత గెలుపు క్రెడిట్ ఆయనకే వెళ్తుందని కాంగ్రెస్‌లోనే కొంత మంది భావిస్తున్నారు.

మరోవైపు.. ఈ సాగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్ మార్పు ఉంటుంది. అందుకే.. రేవంత్ రెడ్డి పాత్ర వీలైనంత తక్కువ ఉండేలా చూడాలని కాంగ్రెస్ సీనియర్లు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి అనుచరులుగా పేరున్న వారు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరిపోగా.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా అదే బాట పట్టారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారన్నదానిపై క్లారిటీ లేదు. మొత్తానికి కాంగ్రెస్‌లో రేవంత్‌ను ఒంటరిని చేయడమే కాదు.. ఆయనను పార్టీ నుంచి దాదాపు దూరం పెట్టాలనే సీనియర్ల ఆలోచన అని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్