ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో అసోం కూడా ఉంది. మూడు దశల్లో అక్కడ పోలింగ్ ముగిసింది. పిల్ల పుట్టకముందే కుల్లాయి కుట్టించడం సబబు కాదని తెలిసినా.. ఎవరి అంచనాలు వారికి ఉంటాయి కాబట్టి.. అక్కడ బీజేపీ నేతలకూ వారి లెక్కలు వారికి ఉన్నాయి. మే 2న వెలువడే ఫలితాల్లో తాము మరోసారి అసోం పీఠాన్ని అధిరోహిస్తామని కమలదళం ధీమాగా ఉంది. దీంతో.. అక్కడ ముఖ్యమంత్రి ఎవరన్నది ఆ పార్టీలో ప్రధాన చర్చగా మారింది.
సహజంగా.. ఏ రాష్ట్రంలోనైనా సిట్టింగ్ లో ఉన్న పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే.. ఉన్న ముఖ్యమంత్రినే కొనసాగిస్తారు. ఆయన పాలనలోనే అధికారం వచ్చిందని, ప్రజలు ఆయన పాలనను మెచ్చుకున్నారనే కోణంలో పాత సీఎంనే కొనసాగిస్తాయి పార్టీలు. అయితే.. ఈ సారి అసోంలో పరిస్థితి అలా లేదన్నది కొందరి వాదన.
ప్రస్తుత అసోం ముఖ్యమంత్రిగా సర్బానంద సోనవాల్ ఉన్నారు. అయితే.. ఆయనతోపాటు హిమంత బిశ్వ శర్మ కూడా రేసులో ఉన్నారు. సోనవాల్ మొదట్నుంచీ బీజేపీ నేతగా ఉండగా.. శర్మ మాత్రం 2016లో పార్టీలో చేరారు. వీళ్లిద్దరూ సీఎం పదవి కోసం ప్రయత్నిస్తున్నారన్న సంగతి ఓపెన్ సీక్రెట్. కానీ.. బయటకు మాత్రం ఎవ్వరూ మాట్లాడట్లేదు. అధిష్టానమే నిర్ణయిస్తుంది అన్నట్టుగా ఉంటున్నారు. అయితే.. సిట్టింగ్ సీఎంగా తనకే అవకాశం దక్కుతుందని సోనవాల్ భావిస్తున్నారు. రావాల్సిందేనని కోరుకుంటున్నారు కూడా.
కానీ.. ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు బీఎల్ సంతోష్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో.. అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ సీఎం సోనవాల్ కే ఇచ్చేట్టుగా ఉంటే.. ఆయన పేరును ప్రకటించేవారు కదా? ఇప్పుడు చర్చ అవసరం లేదు అంటున్నారంటే.. అందులో మతలబు ఉందని అంటున్నారు పరిశీలకులు.
బిశ్వ శర్మ రేసులో ఉండడం వల్లే ఈ కామెంట్ వచ్చిందని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి 2015లో బీజేపీలో చేరిన శర్మ.. 2016 ఎన్నికల సమయంలోనే సీఎం సీటును ఆశించినట్టు చెబుతారు. కానీ.. వచ్చీ రాగానే ముఖ్యమంత్రి సీటుమీద కూర్చోబెడితే వ్యతిరేకత వస్తుందని బీజేపీ భావించిందని అంటుంటారు. అయితే.. ఈ సారి మాత్రం పీఠాన్ని వదులుకోవడానికి శర్మ సిద్దంగా లేరన్నది వినిపిస్తున్న మాట. మరి, ఈ ఎన్నికల్లో గెలిస్తే.. బీజేపీ అధిష్టానం ఏం చేస్తుంది? ఎవరికి ఓటు వేస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.