Rythu Bharosa: రైతు భరోసా’ నిధులు ఎప్పుడు జమ అవుతాయంటే?

తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకాలం ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’పై కీలక ప్రకటన చేసింది. అతి త్వరలోనే రైతు భరోసా అందిస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు

Written By: Srinivas, Updated On : October 18, 2024 10:59 am

Rythu-Bharosa

Follow us on

Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకాలం ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’పై కీలక ప్రకటన చేసింది. అతి త్వరలోనే రైతు భరోసా అందిస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిసి్తుంది. తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీని ఈ నెలలోపు పూర్తి చేస్తామని అన్నారు. రూ.2 లక్షల లోపు రుణమాఫీ కాని వారు 4 లక్షల మంది ఉన్నారని, వారికి కొన్ని సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ మొత్తం జమకాలేదని అన్నారు. ఈ సమస్యలను పూర్తి చేసిన తరువాత రూ.2 లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీని విడతల వారీగా చేస్తామని అన్నారు. అయితే రైతు భరోసా ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉందంటే?

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ‘రైతు బంధు’ పథకాన్ని తీసుకొచ్చింది.వ్యవసాయ రైతులకు పెట్టుబడి సాయం కింద పంట వేసుకునే ప్రారంభంలోనే అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎకరానికి రూ.5 వేల చొప్పున అందించాలని నిర్ణయించి.. ప్రతీ ఏడాది రెండు విడుదలుగా అందించింది. అంటే ఎకరాకు ఏడాదికి రూ. 10వేలు అందించింది. అయితే గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు రైతు బంధును రూ. 10 వేల నుంచి రూ. 15 వేలకు పెంచుతామని ప్రకటించారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ ఎస్ ప్రవేశపెట్టిన రైతుబంధును అలాగే అందించింది. ఈ పథకంను ప్రక్షాళన చేయాలని, సాగులేని భూములకు కూడా రైతు బంధు అందుతుందని, అనర్హులను ఏరివేసి అర్హులైన నిజమైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని పేర్కొన్నారు. అయితే ఇందు కోసం గ్రామ గ్రామాన సమావేశాలు నిర్వహించి రైతు అభిప్రాయాలు సేకరించారు. ఇంతలో రైతు రుణమాఫీ చేయడంతో రైతు బంధును చెల్లించలేదు.

ఈ నేపథ్యంలో రైతులు, ప్రతిపక్షాల నుంచి రైతు భరోసా నిధులపై ఒత్తిడి పెరిగింది. ఈ తరుణంలో అతి త్వరలోనే రైతు భరోసా అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. అయితే రైతు భరోసా పాత వారికే ఇస్తారా? లేదా 5 ఎకరాల్లోపు ఇస్తారా?అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే గతంలో సాగులేని భూములకు కూడా రైతు బంధును పొందారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చేసి అర్హులైన వారికి రైతు భరోసా అందిస్తామని అంటున్నారు.

రైతు భరోసాను ఏడాదికి రూ. 15,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో సగం రూ.7,500 ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం వరికోతలు ప్రారంభం అయ్యాయి. జనవరిలో మళ్లీ పంట వేసేందుకు రైతులు సిద్ధం కానున్నారు. అయితే అప్పుడే రైతు భరోసా నిధులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి గత పెట్టుబడి సమయంలోనే రూ.7,500 ఇవ్వాల్సి ఉంది. అప్పుడు రుణమాఫీ చేయడంతో ఆ తరువాత ఒకేసారి రూ.15వేలు అందిస్తారన్న ప్రచారం సాగింది. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటనతో రూ.7,500 చెల్లించే అవకాశం ఉంది.