Cloud Burst : ఆకాశానికి చిల్లు పడుతోందా? ప్రపంచానికి ఈ కొత్త ఉపద్రవం ఏంటి? కారణమేంటి?

చైనాలో తుఫాన్ ప్రభావానికి పెద్ద పెద్ద భవనాలే నేలకూలుతున్నాయి. ఈదురు గాలులకు ప్రజలు ఎగిరి పడిపోతున్నారు. మనదేశంలోనూ ఆకాశానికి చిల్లు పడిందా అనేలాగా వర్షాలు కురుస్తున్నాయి.. కుండ పోత వర్షాలతో అనేక రాష్ట్రాలు నరకం చూస్తున్నాయి. ఈశాన్యం నుంచి దక్షిణాది వరకు ఇదే పరిస్థితి..

Written By: Anabothula Bhaskar, Updated On : September 8, 2024 1:19 pm

Cloud Burst

Follow us on

Cloud Burst : ” ఈ స్థాయిలో వానలు కురుస్తున్నాయి. ఇలాంటి దుస్థితి నేను ఎప్పుడూ చూడలేదు.. గుజరాత్ రాష్ట్రాన్ని చాలా ఏళ్లుగా పరిపాలించా. ఎన్నో ప్రకృతి విపత్తులను చవి చూశా. కానీ ఇప్పుడు కురుస్తున్న వర్షం, పోటెత్తుతున్న వరద ఎప్పుడో చూడలేదు. గుజరాత్ మాత్రమే కాదు, దేశం మొత్తం జల ప్రళయం కనిపిస్తోందని” స్వయంగా నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలు నీట మునిగాయి. గంటల వ్యవధిలోనే 30+ సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్షం వల్ల వరద తాకిడి పెరిగిపోవడంతో జాతీయ రహదారులు కొట్టుకుపోయాయి. వంతెనలు నామరూపాలు లేకుండా పోయాయి. పంట పొలాలు ఇసుక మేటలు వేసాయి. గ్రామాలకు గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదు. గత ఏడాది క్లౌడ్ బరస్ట్ వల్ల విపరీతమైన వర్షాలు కురిసాయి. కొన్ని ప్రాంతాలలో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు కురవలేదు.

గతానికంటే భిన్నంగా..

ఈసారి ఎల్ నినో ప్రభావం పూర్తిగా లేదు. అయితే గతానికంటే భిన్నంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే ఈ వర్షాలు అన్నిచోట్ల పడితే పెద్దగా సమస్య ఉండేది కాదు. అయితే వర్షం ఒక్క చోట మాత్రమే కుండ పోతగా కురవడం వల్ల ఇబ్బంది ఎదురవుతోంది. దీనిని వాతావరణ నిపుణులు క్లౌడ్ బరస్ట్ అని పిలుస్తున్నారు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ అవ్వడం వల్ల కొన్ని వేల ఎకరాల్లో అడవి నాశనమైంది. చెట్లు మొత్తం విరిగిపోయాయి.. కృష్ణాజిల్లాలో విజయవాడ నగరం మొత్తం నీట మునిగిపోయింది.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఖమ్మం, విజయవాడ, వరంగల్ మాత్రమే కాదు.. దేవభూమి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాలలో క్లౌడ్ బరస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి.. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో జలవిలయం చోటు చేసుకోవడానికి కూడా క్లౌడ్ బరస్ట్ కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

మనదేశంలోనే కాదు..

మనదేశంలోనే కాదు చైనాలోనూ క్లౌడ్ బరస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ యాగి తుఫాను పెను విధ్వంసం సృష్టిస్తోంది. వరదలు చుట్టుముట్టడంతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడిదాకా ఎందుకు పూర్తి ఎడారి ప్రాంతమైన దుబాయ్ లోనూ విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని వరదలు వణికిస్తున్నాయి.. ఇక బంగ్లాదేశ్ లోనూ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇలా ప్రపంచం నలుమూలల ఏదో ఒకచోట ప్రకృతి విపత్తు చోటు చేసుకుంటూనే ఉంది. అంటే అమెరికా నుంచి మొదలు పెడితే ఆఫ్గనిస్తాన్ వరకు క్లౌడ్ బరస్ట్ విపత్తు అనేది ఉంది.. ప్రకృతిపై మనిషి చేస్తున్న పెత్తనం వల్ల ఇలాంటి ఇలాంటి విపత్తులు చోటుచేసుకుంటున్నాయి.

మేఘాల గమనంలో మార్పు

వాతావరణ మార్పుల వల్ల మేఘాలు ఏర్పడటం.. అవి బద్దలైపోయి విస్తారంగా వర్షం కురవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు మేఘాలు అంతటా విస్తరించి వర్షాలు కురిసేవి. కానీ ఇప్పుడు మేఘాల గమనంలో కూడా మార్పు వస్తోంది. ఒకే చోట కుండపోత గా వర్షాలు కురుస్తున్నాయి. భూ ఉపరితలం వేడెక్కడం.. సముద్ర ఉపరితల వేడెక్కడం.. మేఘాలు భారీగా సముద్రపు నీటిని తీసుకొని అంతే స్థాయిలో ఒకే చోట వర్షాలు కురిపించడం వంటి పరిణామాల వల్ల ఇంతటి విపత్తులు చోటు చేసుకుంటున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. గత ఏడాది జూలై నెలలో క్లౌడ్ బరస్ట్ అయింది. ఆ సమయంలో దానిని విదేశీ కుట్ర అని నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు.. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని.. ప్రస్తుతం మనిషి చేస్తున్న పనుల వల్ల ప్రకృతి ఆగ్రహిస్తోందనేది మాత్రం నూటికి నూరుపాళ్ళు కఠిన వాస్తవం.