ఐదు సార్లు ఎమ్మెల్యే.. ఐదేళ్లు మంత్రిగా పనిచేశారు కింజారపు అచ్చెన్నాయుడు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. శ్రీకాకుళానికి చెందిన ఆయన బీసీ నేత. సీనియర్ లీడర్ కూడా. అందుకే.. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కూడా లభించింది.
అంతటి సీనియర్ లీడర్ కావడంతో సందర్భం ఏదైనా ఆచితూచి వ్యవహరించాల్సిన ఉంటుంది. ముఖ్యంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడితే అది ఆయన రాజకీయ భవితవ్యానికి కూడా ప్రశ్నార్థకం కావచ్చు. సరిగా ఈ మధ్య అలాంటి వ్యాఖ్యలే చేసి ఇప్పుడు వివాదంలో పడ్డారు అచ్చెన్నాయుడు. అంతటి రాజకీయ అనుభవశాలి నోట వచ్చిన మాట ఇప్పుడు సొంత పార్టీలో, బయటి పార్టీలోనూ చర్చకు దారితీసింది.
‘‘17 అయిపోతే ఫ్రీ అయిపోతాం.. ఆ తర్వాత పార్టీ లేదు బొక్కాలేదు” అంటూ అచ్చెన్నాయుడు మాట్లాడినట్లుగా వైరల్ అయిన వీడియో ఫేక్ అంటూ స్వయానా అచ్చెన్నాయుడే ఖండించినా ఆ ప్రకంపనలు మాత్రం ఇంకా తొలగలేదు. అచ్చెన్నాయుడు చెప్పింది నిజమే కదా అంటూ వైసీపీ నేతలు కూడా సెటైర్లు వేస్తుండగా.. తమ నేత మీద అధికార పార్టీ కక్షతోనే ఈ ఆరోపణలు చేస్తోందని కొందరు తమ్ముళ్లు వారిస్తున్నారు.
అయితే.. ఏది ఏమైనా 17వ తేదీ గడిస్తే కానీ ఏది తెలియకుండా ఉంది. 17 తర్వాత అచ్చెన్న ఏం చేయబోతున్నాడనేది ఇప్పుడు రాజకీయంగా చర్చ నడుస్తోంది. అచ్చెన్నకు నిజంగానే పార్టీ మీద అంతలా ఆసక్తి లేదా..? ఎందుకు అంత అసంతృప్తిలో ఉన్నారనేది తెలియకుండా ఉంది. అంతేకాదు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైరికల్గా చేసిన ట్వీట్ కూడా ఆలోచింపజేస్తోంది. అచ్చెన్న వైసీపీలో చేరుతాడంటూ ఆయన ట్వీట్ చేయడం.. ఆకుల వెంకట్తో ఇప్పుడు అచ్చెన్న సంభాషణ పైనే అందరి దృష్టి నెలకొంది.