బెంగాల్‌ ఫలితాలపైనే భవిష్యత్‌ రాజకీయాలు

దేశంలో ఎదురులేని రాజకీయ శక్తిగా ఎదిగింది బీజేపీ. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రజాస్వామ్య దేశంలో గతంలో ఎన్నడూ లేనంత బలీయమైన ప్రధానిగా నరేంద్రమోడీ తనను తాను మలచుకున్నారు. చాలా విషయాల్లో ఇందిరాగాంధీ రికార్డులను సైతం తిరగరాసేశారు. అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని ఆయన ప్రత్యర్థులను విమర్శిస్తూ ఉంటారు. ఎంతటి బలీయమైన రాజుకైనా, ప్రధానికైనా అధికారం శాశ్వతం కాదు. పవర్ లో ఉండటం పర్మినెంటూ కాదు. అందులోనూ మతము, భావజాలం పేరిట గిచ్చి కయ్యాలు పెట్టుకునే మనస్తత్వం ఉన్న […]

Written By: Srinivas, Updated On : March 3, 2021 10:36 am
Follow us on


దేశంలో ఎదురులేని రాజకీయ శక్తిగా ఎదిగింది బీజేపీ. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రజాస్వామ్య దేశంలో గతంలో ఎన్నడూ లేనంత బలీయమైన ప్రధానిగా నరేంద్రమోడీ తనను తాను మలచుకున్నారు. చాలా విషయాల్లో ఇందిరాగాంధీ రికార్డులను సైతం తిరగరాసేశారు. అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని ఆయన ప్రత్యర్థులను విమర్శిస్తూ ఉంటారు. ఎంతటి బలీయమైన రాజుకైనా, ప్రధానికైనా అధికారం శాశ్వతం కాదు. పవర్ లో ఉండటం పర్మినెంటూ కాదు. అందులోనూ మతము, భావజాలం పేరిట గిచ్చి కయ్యాలు పెట్టుకునే మనస్తత్వం ఉన్న కమలనాథులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. మోడీ జమానాకి పశ్చిమబెంగాల్ వేదికగా వ్యతిరేకత ప్రారంభం కాబోతోందనే సందేహాలు ముసురుకుంటున్నాయి.

Also Read: అమ్మాయితో రాష్ట్రమంత్రి సెక్స్ వీడియో.. వైరల్

దేశంలో పెద్ద నాయకులను భయం గుప్పిట్లో పెట్టుకోవడం నరేంద్ర మోడీకే చెల్లింది. దీటుగా బీజేపీని, మోడీని ఎదిరించే నాయకులు లేకుండా పోయారు. దళిత్ ఐకాన్‌గా ఉన్న జాతీయ నాయకురాలు మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేతగా వెలిగిన ములాయం సింగ్ యాదవ్, ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ వంటి మహామహులంతా రాజీ పడిపోయారు. మాజీ ప్రధాని దేవెగౌడ కర్ణాటకలో తన పార్టీ అస్తిత్వం మిగిలితే చాలన్నట్లుగా మోడీ ఊసే ఎత్తడం లేదు. అరవింద్ కేజ్రీవాల్ వంటి రెబల్ స్టార్ కూడా కిమ్మనడం లేదు. జాతీయంగా చక్రం తిప్పానని చెప్పుకునే ఒకనాటి యునైటెడ్ ప్రంట్ కన్వీనర్ చంద్రబాబు బీజేపీ కరుణ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఘనమైన ప్రజాబలం కలిగిన జగన్ మోహన్ రెడ్డి ‘ఎస్ సార్’ అన్నట్లుగా తన ధోరణి కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం కేంద్ర దర్యాప్తు సంస్థల చాకచక్యం, దాదాపు నేతలంతా ఏవో లొసుగులతో సతమతం కావడమే భయం గుప్పిట్లో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణం.

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ స్వీయపరాధాలతో తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంది. పరిపాలనలో, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో మన్మోహన్ సింగ్ చాలా బాగా పనిచేశారు. కానీ.. రాజకీయం నడపటంలో పార్టీ అధ్యక్షురాలైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ విఫలమయ్యారు. చిదంబరం, దిగ్విజయ్, గులాం నబీ అజాద్ వంటి వారు పార్టీని పూర్తిగానే భ్రష్టు పట్టించారు. తమ ప్రయోజనాల కోణంలో పార్టీని పక్కదారి పట్టించారు. చిదంబరం తన అధికారంతో చేసిన కుంభకోణాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. యువతరం పార్టీలో బలపడకుండా దిగ్విజయ్, కమలనాథ్, ఆజాద్ అడుగడుగునా అడ్డుకుంటూ వచ్చారు. కాంగ్రెస్‌ ఇప్పటికీ కేంద్రస్థానంలో ఉన్నా.. ఆసరా ఇచ్చేందుకు మాత్రం ఇతర పార్టీలు కలిసి రావడం లేదు.

Also Read: వామన్ రావు దంపతుల హత్యపై స్పందించిన కేటీఆర్

ఈ స్థితిలో ప్రస్తుతం జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు విపక్షాలు మానసిక స్తైర్యాన్ని నింపుకునేందుకు దోహదం చేయవచ్చుననే భావన వ్యక్తమవుతోంది. షా వ్యూహాలు, మోడీ కరిష్మాలు పనిచేయకపోతే ప్రజా తీర్పులో సామాన్యుని కష్టాలే ప్రతిబింబిస్తే కచ్చితంగా మార్పునకు పునాది పడుతుందంటున్నారు. ప్రతిపక్షాలన్నిటినీ ఒకే తాటిపై నడపాలంటే దీటైన నాయకత్వం కావాలి. ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. వారసత్వం పట్ల తనకు ఏమాత్రం నమ్మకం లేదంటున్న రాహుల్ గాంధీ ఇతరుల నాయకత్వంలో పనిచేసేందుకూ సిద్ధం కావాలి. కాంగ్రెస్‌ దేశంలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీ. ఈ స్థితిలో మమతా బెనర్జీ నాయకత్వంపై మరోసారి చర్చ మొదలైంది. బెంగాల్‌లో విజయమో, వీరస్వర్గమో అన్న రీతిలో మమతా బెనర్జీ తెగించి పోరాడుతున్నారు. మోడీ, షా , కేంద్ర దర్యాప్తు సంస్థలు, సంఘ్ పరివార్ శక్తులు అన్నిటినీ ఆమె ఒంటి చేత్తో ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పోరాటంలో మమత విజయం సాధించి పశ్చిమబెంగాల్ లో మరోసారి అధికారం దక్కించుకుంటే భారత చరిత్రలో కీలక రాజకీయ పరిణామమే అవుతుంది. చెల్లాచెదురై ఉన్న విపక్షాలు మళ్లీ ఒక గొడుగు కిందకు చేరేందుకు ఆసరా లభిస్తుంది. దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు పశ్చిమబెంగాల్ ఆశ్రయంగా మారవచ్చునంటున్నారు. ఒకవేళ అనూహ్యంగా మమతా బెనర్జీ బీజేపీ చేతిలో పరాజయం చవిచూస్తే 2024 పై కూడా విపక్షాలు ఆశలు వదులుకోవాల్సి రావచ్చు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్