Praja sangram Yatra: 2023 ఎన్నికల తరువాత గొల్లకొండ కోటపై కాషాయ జెండాను ఎగరేసి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేసిన తరువాత మొట్ట మొదటి బహిరంగ సభను భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దే నిర్వహించి తీరుతామని పునరుద్ఘాటించారు. టైగర్ నరేంద్ర భాయిసాబ్, బద్దం బాల్ రెడ్డి ను స్మరించుకుని రాబోయే ఎన్నికల్లో కదం తొక్కుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘సౌ సద్దాం…గోల్కొండ బద్దం. గోల్కోండ సీఎం బద్దం బాల్ రెడ్డి’’అంటూ బీజేపీ సీనియర్ నేతలు ఆలె నరేంద్ర, బద్దం బాల్ రెడ్డి లను స్మరించుకున్నారు.
ప్రజా సంగ్రామ యాత్ర(Praja Sangram Yatra) లో భాగంగా రెండో రోజైన ఆదివారం గోల్కొండ కోట వద్ద ఏర్పాటు చేసిన సభకు భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ ఎంఐఎం నేతలపై మండిపడ్డారు. ‘‘మా జోలికి వస్తే ఖబడ్దార్.. బీజేపీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కానీ హిందూ ధర్మానికి అడ్డొస్తే…హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తే…గోమాతను వధిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. అడ్డుకుని తీరుతాం. మా నినాదాలతో చెవుల్లోంచి రక్తం కారి పారిపోతారు జాగ్రత్త’’అని హెచ్చరించారు.
ట్రిపుల్ తలాక్ తెచ్చిన పార్టీ బీజేపీ మాత్రమేనని, ముస్లిం సమాజం పేదరికంలో ఉన్నందునే ట్రిపుల్ తలాఖ్ అనే మూర్ఖత్వపు సంస్కారాన్ని అడ్డుకున్నామని అన్నారు. ఎంఐంఎం గుండాల చేతిల్లో ఎందరో కాషాయ కార్యకర్తలు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ వెరవకుండా కాషాయ జెండా మోస్తున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్ తెలిపారు. అయోధ్యలోనూ కరసేవకుల త్యాగాలు వ్రుథా కాలేదని, వారి స్పూర్తితో అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన ఆలయాన్ని నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
అంతకుముందు బీజేపీ శాసనసభానేత రాజాసింగ్ ‘భారత్ మాతాకీ జై… జై శ్రీరాం’ అని నినదిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర జరిగిన సభలో పాల్గొనలేకపోయినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. బండి సంజయ్ గారికి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు లభించాయని, అందుకే ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. ‘‘మనం ఇప్పడు చారిత్రక గోల్కొండ కోట వద్ద ఉన్నాం. గోల్కొండ కోటను నిర్మించింది కుతుబ్ షాహీలు కాదని, కాకతీయులకు చెందిన హిందూ రాజులనే విషయాన్ని గుర్తు చేశారు. అట్లాగే ధనిక రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ దివాళా తీయించి రూ. 4 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. తాను ముస్లింల వ్యతిరేకిని కానని, ఎంఐఎంకు మాత్రమే వ్యతిరేకినని అన్నారు. వేల ఎకరాలను దోచుకున్న ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకోవడానికి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు.