CM Stalin: హోసూరుకు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.. స్టాలిన్ అద్భుత నిర్ణయం..

అసెంబ్లీ రూల్ 110 కింద ఈ ప్రకటన చేసిన ఆయన, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఇటీవలి సంవత్సరాల్లో ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తున్న హోసూరు, చుట్టుపక్కల అనేక తయారీ యూనిట్లకు కనెక్టివిటీని పెంచే అవసరాన్ని ఆయన సభలో నొక్కి చెప్పారు.

Written By: Neelambaram, Updated On : June 28, 2024 2:35 pm

CM Stalin

Follow us on

CM Stalin: తమిళనాడులోని హోసూరును కీలక పారిశ్రామిక కేంద్రంగా మలచాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఏడాదికి సుమారు 3 కోట్ల మంది రాకపోకలు సాగించేందుకు 2000 ఎకరాల్లో భారీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గురువారం (జూన్ 27) అసెంబ్లీలో ప్రకటించారు.

అసెంబ్లీ రూల్ 110 కింద ఈ ప్రకటన చేసిన ఆయన, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఇటీవలి సంవత్సరాల్లో ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తున్న హోసూరు, చుట్టుపక్కల అనేక తయారీ యూనిట్లకు కనెక్టివిటీని పెంచే అవసరాన్ని ఆయన సభలో నొక్కి చెప్పారు. హోసూరులో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో చర్యలు చేపడుతోందన్నారు. హోసూరు కోసం కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని ఇది త్వరలో పూర్తి కాబోతోందన్నారు.

కృష్ణగిరి, ధర్మపురి ప్రాంతాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేందుకు హోసూరులో విమానాశ్రయం అవసరం ఉందని ప్రభుత్వం భావించిందని ఆయన చెప్పారు. హోసూరుకు బెంగళూర్ కు రోడ్డు మాత్రం గంటన్నర మాత్రమే అని ఇక ప్లయిన్ మార్గం మరింత తక్కువ సమయం పడుతుంది కాబట్టి జంట విమానాశ్రయాలుగా రెండు ఉండబోతాయని ఆయన అన్నారు. తమిళనాడు, కర్ణాటక రెండింటిలోనూ వృద్ధిని ప్రోత్సహిస్తుందని తమిళనాడు పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా అనంతరం ఒక ప్రకటనలో తెలిపారు.

‘ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీని పెంచడంతో పాటు ఆర్థికవృద్ధిని ప్రేరేపిస్తుందన్నారు. ఇది హోసూర్ మాత్రమే కాకుండా ధర్మపురి, సేలం వంటి పొరుగు జిల్లాలకు కూడా ప్రయోజనంకరంగా మారుతుందన్నారు. బెంగళూరులోని వివిధ ప్రాంతాలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని’ రాజా అన్నారు.

‘ఈ విజన్ ను సాకారం చేసేందుకు కృషి చేస్తున్న సీఎం స్టాలిన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర ప్రణాళికా సంఘంలో ఉన్నప్పటి నుంచి హోసూరులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరుతున్నా ఆ కల ఇప్పుడు నెరవేరబోతోంద’ని రాజా కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
హోసూరు బెంగళూరు, చెన్నైల వ్యూహాత్మక సమీపంలో ఉండడం.. దాని అభివృద్ధి చెందుతున్న ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని విమానాశ్రయం అందించే గణనీయమైన ఆర్థిక ప్రోత్సాహాన్ని గుర్తించారు.

హోసూరు ఇప్పటికే ఎగ్జిమ్ గేట్ వేలకు అద్భుతమైన కనెక్టివిటీ కలిగి ఉందని, చెన్నై, తిరువళ్లూరు, శ్రీపెరంబుదూర్, కోయంబత్తూరుతో సహా ఇతర ప్రధాన వ్యాపార కేంద్రాలు, పారిశ్రామిక క్లస్టర్లకు సమీపంలో ఉందని రాజా కార్యాలయం తెలిపింది. ఆటో, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అధునాతన తయారీ, లాజిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ కు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం ప్రణాళికాబద్ధమైన ఐటీ పార్కుతో ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతోందని తెలిపింది.

‘హోసూరులో విమానాశ్రం ఏర్పాటు ఈ ప్రాంతానికి గేమ్ ఛేంజర్ అవుతుంది, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ముఖచిత్రానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఈ ఎయిర్ పోర్ట్ నిస్సందేహంగా ఈ ప్రాంతం కనెక్టివిటీని పెంచుతుంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుంది, హోసూర్ స్థానాన్ని ప్రధాన పారిశ్రామిక, ఆర్థిక కేంద్రంగా స్థిరపరుస్తుంది’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జయరంజన్ అన్నారు.

తమిళనాడు వాయవ్య ప్రాంతంలో పారిశ్రామిక, ఆర్థిక వృద్ధి, పర్యాటకం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రాంతంలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని పరిశ్రమల శాఖ రెండేళ్ల క్రితం పాలసీ నోట్ లో ప్రకటించింది.

హోసూరులో తనేజా ఏరోడ్రోమ్ అని పిలిచే విమానాశ్రయం ఉంది. దీనిని పూణేకు చెందిన ఆపరేటర్ తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ (టీఏఏఎల్) యాజమాన్యం నడిపిస్తుంటుంది.