ఒకే మాట.. ఒకే కట్టుబాటు..: ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు

ఒక గ్రామ ప్రజలు ఒక మాటపై కట్టుబడ్డారంటే వారిని విడదీయడం ఎవరి తరమూ కాదు. చివరికి కొండ మీది గోపయ్య దిగివచ్చినా వినేది ఉండదు. సరిగా అదే చేశారు ఆ గ్రామస్తులు. హెచ్చరించినట్లు గానే అన్నంత పని చేశారు. ఏ ఒక్క నామినేషన్ దాఖలు కాకుండా ఒకే మాటపై నిలబడ్డారు.ప్రతి గ్రామానికి రోడ్డు వేసే వరకు ఎన్నికలు బాయికాట్ చేస్తామని చెప్పినట్లుగానే ఒక్క నామినేషన్ పడకుండా చేశారు. దీంతో ఎన్నికలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా […]

Written By: Srinivas, Updated On : February 6, 2021 2:29 pm
Follow us on


ఒక గ్రామ ప్రజలు ఒక మాటపై కట్టుబడ్డారంటే వారిని విడదీయడం ఎవరి తరమూ కాదు. చివరికి కొండ మీది గోపయ్య దిగివచ్చినా వినేది ఉండదు. సరిగా అదే చేశారు ఆ గ్రామస్తులు. హెచ్చరించినట్లు గానే అన్నంత పని చేశారు. ఏ ఒక్క నామినేషన్ దాఖలు కాకుండా ఒకే మాటపై నిలబడ్డారు.ప్రతి గ్రామానికి రోడ్డు వేసే వరకు ఎన్నికలు బాయికాట్ చేస్తామని చెప్పినట్లుగానే ఒక్క నామినేషన్ పడకుండా చేశారు. దీంతో ఎన్నికలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కలెక్టర్ సహా అధికారులంతా గ్రామస్తులను బతిమాలినా వినలేదు. రోడ్డు వేసి రండి ఆ తర్వాతనే ఎన్నికలంటే వెనక్కి తిప్పి పంపించారు. రోడ్డు కోసం గ్రామస్తులు నిర్ణయం కర్నూలు జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో చర్చనీయాంశం అయింది.

ఎక్కడో మారుమూలాన ఉండే గ్రామం అది. ఆ ఊరికి వెళ్లాలంటే రహదారి అంతా రాళ్లు, గుంతల మయం. అందుకే ఆ ఊరికి బంధువులు రావాలన్నా ఆసక్తి చూపరు. చివరికి రోడ్డు బాగాలేదని ఎమ్మెల్యే కూడా ఆ ఊరికి వెళ్లడం లేదు. అనేకసార్లు ఆ ఊరి జనం అధికారులకు, నేతలకు మొరపెట్టుకొని విసిగిపోయారు. ఊరి బాగుకు ఉపయోగపడని ఎన్నికలు మా కొద్దంటూ ఆ ఊరి జనం పంచాయతీ ఎన్నికల బహిష్కరణకు నిర్ణయించి అమలు చేశారు. ఒక్కరు కూడా నామినేషన్ వేయకుండా ఒక్క మాటమీద ఉన్నారు.

Also Read: ‘ఉక్కు’ద్రవం మొదలైంది

కర్నూలు నగరానికి 20 కి.మీ దూరంలో.. కర్నూలు–-గుంటూరు స్టేట్ హైవేకి 10 కి.మీ దూరంలో పూడూరు అనే గ్రామం ఉంది. ఈ ఊరి జనాభా 2 వేలు. ఓటర్లు 913 మంది. ఈ ఊరు చేరుకోవాలంటే చుక్కలు చూడాల్సిందే. రోడ్డు అంతలా అధ్వానంగా ఉంటుంది. రోడ్డు బాగా లేదని ఆర్టీసీ బస్సు, అంబులెన్స్ వంటి వాహనాలు కూడా రావడం మానేశాయి. గర్భిణులు అయితే ఆసుపత్రికి వెళ్లకుండానే ప్రసవం అయిపోయేంతలా గుంతుల, రాళ్లు తేలిపోయాయి. ఊరి జనానికి తప్పింది కాదు.. ఈ రోడ్డులోనే నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు.

గతంలో ఈ రోడ్డు బాగానే ఉండేది. పూడూరు వద్ద ఇసుక రీచ్ గుర్తించడంతో భారీ వాహనాలు తిరిగి రోడ్డు రూపురేఖలు మారిపోయాయి. పదేళ్లకుపైగా రోడ్డు వేయాలని ఊరి జనం అడగని నాయకుడు లేడు. వేడుకోని అధికారి లేడు. గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కార్యక్రమాన్ని కూడా గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులు గ్రామంలోకి రాకుండా ఎడ్లబండ్లు, బైకులు, ముళ్లకంప అడ్డుపెట్టి అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. రోడ్డు వేసిన తరువాతే జన్మభూమి కార్యక్రమం నిర్వహించుకోవాలని గ్రామస్తులు ఆంక్షలు పెట్టారు. అప్పటికి తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత రూ.5 కోట్లు మంజూరు చేసినా టెండర్ల నిర్వహణలో జాప్యం చేయడం, సకాలంలో పనులు చేపట్టకపోవడం, 2019 ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. 25 శాతం కంటే తక్కువ పనులు చేసిన వాటిని రద్దు చేసిన పనుల్లో ఇదీ ఒకటి.

Also Read: సీఎంపై తుది నిర్ణయం జేపీ నడ్డా, పవన్ కళ్యాణ్ లదేనా?

ఇక కొత్త ప్రభుత్వం వచ్చాకనైనా.. రోడ్డు వేస్తారని రెండేళ్లుగా జనం ఎదురు చూస్తూనే ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకకూడా అనేకసార్లు రోడ్డు వేయాలని గ్రామస్తులు అభ్యర్థించారు. అయినా స్పందన లేదు. రోడ్డు బాగా లేదని ఎమ్మెల్యే సుధాకర్ గ్రామానికి రావడమే మానేశారు. పూడూరుకు ఇళ్ల పట్టాలు మంజూరైతే రోడ్డు బాగాలేని కారణంగా ఊరికి రాలేనని, పక్కనే ఉన్న దేవమడ గ్రామానికి వచ్చి తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఒక్క రోజు పూడూరుకు రావడానికి అంతగా ఇబ్బంది పడుతున్నారంటే ఏళ్ల తరబడి ఆ ఊరి జనం ఎంతగా ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూడూరు రోడ్డు బాగు చేయలేని ఎన్నికలు మాకెందుకు అంటూ ఆ ఊరి జనం ఏకమయ్యారు. పంచాయతీ ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఊరిలో ఏకంగా దండోరా వేయించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

మరోవైపు.. ఇక్కడ ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. పలు దఫాలుగా అధికారులు గ్రామానికి వెళ్లి స్థానికులతో చర్చించారు. జడ్పీ సీఈఓ, డీపీవో కూడా గ్రామానికి వెళ్లి ఎన్నికలు బహిష్కరించవద్దని, రోడ్డు వేస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గతంలో అధికారులు హామీలను గ్రామస్తులు అధికారుల ముందు పెట్టారు. కలెక్టర్ వచ్చి చెప్పాలని పట్టుబట్టారు. నిన్న సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల గడువు ముగిసింది. కొందరు యువకులు నామినేషన్ వేసే ప్రయత్నం చేశారు. పోటీ చేసినా ఒక్కరు కూడా ఓటు వేసేదిలేదని తేల్చి చెప్పారు. దీంతో నామినేషన్ వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మొత్తమ్మీద పుడూరు గ్రామస్తులంతా ఒకే మాటపై ఉండి ఎన్నికలు బహిష్కరించారు.