Vijayashanthi: బంధు అంటూనే బంద్ చేయించి వెన్ను విరగ్గొట్టడం ఎలాగో తెలంగాణ సీఎం గారికి వెన్నతో పెట్టిన విద్య అని రాములమ్మ ఫైర్ అయ్యారు. పొమ్మనకుండా పొగబెట్టి… పథకం ప్రకారం ఈటలను ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచీ సాగనంపిన కేసీఆర్ నిజస్వరూపాన్ని ఆమె ఎండగట్టారు. హుజురాబాద్ ఉపఎన్నిక బట్టబయలు చేసింది. దళిత బంధు పథకంతో దళిత సామాజికవర్గానికి ఏదో గొప్ప మేలు చేయబోతున్నట్టు… వారి జీవితాల్ని ఉద్ధరించబోతున్నట్టు గొప్పలు చెప్పుకోవడానికి కేసీఆర్ పడుతున్న తిప్పలు ఆయన అసలు రంగును బయటపెడుతున్నాయన్నారు.
kcr vijaya shanthi
గడచిన ఏడేళ్ళ టీఆరెఎస్ పాలనలో దళితులకు కన్నీరు తప్ప మిగిలిందేమీ లేదని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చిన్నపిల్లాడికి సైతం ఇట్టే అర్థమవుతుందని రాములమ్మ కఠిన పదాలతో నిప్పులు చెరిగారు. అసలు కేసీఆర్ అధికార పీఠాన్ని అధిరోహించడానికి ముందుగా మోసం చేసింది దళితులనే అని ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడేనంటూ ముందుగా ఈ సామాజిక వర్గాన్నే పావుగా వాడుకున్నారన్నారు. ఆ తర్వాత దళితులకు మూడెకరాల ముచ్చట చెప్పి వారిని మూడు చెరువుల నీళ్లు తాగించి ఆనందించారు తప్ప ఒరిగిందేమీ లేదన్నారు.
ఇక తాజాగా ఆయన ప్రయోగించిన అస్త్రం దళిత బంధు. పై రెండు హామీల్లాగానే దిగ్విజయంగా ఈ పథకాన్ని కూడా చాలా చాకచక్యంగా అటకెక్కించి… తన చేతికి మట్టి అంటకుండా వ్యవహరిస్తున్నారు కానీ, అందరూ ప్రతిసారీ మోసపోరనే నిజాన్ని ఆయన గ్రహించడం లేదని విజయశాంతి మండిపడ్డారు. దళిత బంధును అలా ప్రవేశపెట్టి ఊరించి…. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులేయించి… డ్రా చేసుకోకుండా వెంటనే ఫ్రీజ్ చేయించి… అలా అలా లాగి లాగి ఎన్నికల కోడ్ కారణంగా అది నిలిచిపోయే వరకూ తీసుకొచ్చారని కేసీఆర్ మోసాలను ఎండగట్టారు. ఈ కుతంత్రాలను ఒక పక్క ప్రయోగిస్తూనే హుజురాబాద్ ఎన్నికలయ్యే వరకు దళితబంధు అమలు కావొద్దని ఈసీతో నిలిపి వేయించి…. ఈటల రాజేందర్ గారి పేరుతో దొంగ లేఖను సృష్టించి.. బిజెపిని బద్నామ్ చేసే కుట్రకు టీఆర్ఎస్ తెర లేపిందని విజయశాంతి సంచలన ఆరోపణలు చేసింది.
ఏడాది క్రితం జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా టీఆరెఎస్ సరిగ్గా ఇదే కుట్రకు పాల్పడి భంగపడిందన్నారు. ఆ ఎన్నికలకు ముందు హైదరాబాద్ నగరంలోని వరద బాధితులకు రూ.10 వేల సహాయాన్ని ప్రకటించిన అధికార పార్టీ.. ఆ మాట నిలుపుకోలేక తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పేరుతో దొంగ లేఖను పుట్టించి, బిజెపి నేతలే వరద సహాయం రాకుండా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని ఆరోపించారని విమర్శించారు. భాగ్యనగర ప్రజలు కేసీఆర్కు షాక్ ఇస్తూ… ఊహించని సంఖ్యలో బీజేపీ ప్రజాప్రతినిధులను జీహెచ్ఎంసీకి పంపించారని.. అదే రీతిలో హుజురాబాద్లోనూ అధికార పార్టీకి షాక్ తప్పదన్నారు.