Rahul gandhi And Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పటివరకు బిజెపి పై పల్లెత్తు మాట అనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా స్వరం పెంచుకుంది. దేశ ప్రజలు పొదుపు పాటించాలని ఏడు అప్పీల్స్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. వాటిని జాతీయ మిషన్ గా ప్రకటించారు. అయితే ఇప్పుడు వ్యతిరేకంగా వైసీపీ కామెంట్లు పెడుతోంది. గతంలో కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా శభాష్ అని పొగిడేవారు జగన్. బిజెపి అడగకుండానే మద్దతు తెలిపేవారు. కానీ ఇప్పుడు సడన్ గా రూటు మార్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ పొదుపు మంత్రాన్ని బోధిస్తే.. దానిని తప్పు పడుతూ మాట్లాడారు పేర్ని నాని. ప్రధాని స్థాయి నేతను చులకన చేస్తూ మాట్లాడారు.
* సాక్షి మీడియా అతి..
తమిళనాడులో విజయ్ గెలుపుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్రమంలో సాక్షి మీడియా చూపించిన ప్రత్యేక ఆసక్తి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. విజయ్ గెలుపును ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించింది సాక్షి. అంతటితో ఆగకుండా ఆయనకు రాహుల్ గాంధీతో ఉన్న పాత స్నేహాన్ని హైలైట్ చేస్తోంది. అయితే రాహుల్ ను ఎత్తిచూపడం ద్వారా.. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు దిశగా జగన్ ఆలోచన చేస్తున్నారా అనేది ఒక అనుమానం. ఏపీలో జవసత్వాలు లేకుండా ఉంది కాంగ్రెస్ పార్టీ. అయినా సరే ఆ పార్టీకి ఓటు బ్యాంకు ఉంది. మళ్లీ జగన్ రూపంలో పొత్తు పెట్టుకుంటే క్యాడర్ ఉత్సాహంతో పనిచేసి.. ఐదు నుంచి 10% ఓటర్లు యాక్టివ్ అవుతారు. సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న చాలా వర్గాలు తిరిగి యాక్టివ్ అవుతాయి. విజయ్, రాహుల్ గాంధీ మధ్య ఉన్న బంధాన్ని సాక్షి విపరీతంగా ప్రచారం చేయడం చూస్తుంటే.. ఏపీలో ఏదో పొత్తుల వ్యూహం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
* జాతీయ స్థాయి విధానాలపై..
గత కొన్నేళ్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను పరిశీలిస్తే.. నేరుగా బిజెపి పై కానీ.. ఎన్డీఏ ప్రభుత్వం పై కాని విమర్శించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు నేరుగా ప్రధానిని టార్గెట్ చేయడం ద్వారా చూస్తుంటే మాత్రం ఏదో ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. పైగా ఏపీ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెట్టే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. జాతీయస్థాయి విధానాలపై బిజెపిపై విమర్శలు చేయడం చూస్తుంటే మాత్రం పక్క వ్యూహం అన్నట్టు అర్థమవుతోంది. ఇక ముసుగులో గుద్దులాట వద్దు అన్నట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కూడా జగన్ అభ్యంతరాలు తెలుపుతూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ వ్యక్తిగత ప్రయాణాలపై కూడా వైసిపి నేతలు మాట్లాడుతున్నారంటే.. బిజెపితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడం లేదని.. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు ఒక మార్గమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.