Vijay Tamil Nadu CM journey: తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. 118 స్థానాలు గనుక గెలిస్తే మ్యాజిక్ ఫిగర్ దక్కించుకోవచ్చు. కానీ తమిళ ఓటర్లు ఈసారి ఏ పార్టీకి కూడా వన్ సైడ్ విక్టరీ ఇవ్వలేదు. కాకపోతే ఈసారి ఆశ్చర్యకరంగా టీవీ కె పార్టీకి 112 స్థానాలు అందించారు. తద్వారా తమిళనాడు అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. టీవీకే అధికారాన్ని దక్కించుకోవడానికి ఇంకా ఆరు స్థానాలు కావాలి. అన్నా డీఎంకే సపోర్ట్ ఇస్తుందని చెప్తున్న నేపథ్యంలో.. తమిళనాడులో టీ వీ కే, అన్నా డీఎంకే, బిజెపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
టీవీ కే ఈ స్థాయిలో విజయం సాధించడం వెనక చాలా కష్టం దాగుంది. ముఖ్యంగా విజయ్ తమిళ ఓటర్లను నమ్మించడంలో.. తనకు ఓటు వేయడంలో విజయవంతమయ్యారు.. 2024 ఫిబ్రవరి 2న విజయ్ టీవీ కే పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆయనను అనేక కష్టాలు చుట్టుముట్టాయి. గత ఏడాది సెప్టెంబర్ 27న ఒక సభ నిర్వహించారు. ఆ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. 41 మంది దుర్మరణం చెందారు. ఈ సంఘటన విజయ్ ని తీవ్రమైన ఇబ్బందికి గురి చేసింది. ఈ కేసును అప్పటి అధికార డిఎంకె తీవ్రంగా పరిగణించింది. ఏకంగా కేంద్ర దర్యాప్తు బృందాలను విచారణకు ఆహ్వానించింది. ఇప్పటికి ఈ కేసు విషయంలో విచారణ జరుగుతూనే ఉంది.
జరిగిన ఘటన తర్వాత విజయ్ కొద్దిరోజుల వరకు బయటకు రాలేదు. ఆ తర్వాత మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారిలో ఒకరు ఆర్థిక సహాయాన్ని స్వీకరించడానికి ఒప్పుకోలేదు. ఈ ఘటన తర్వాత విజయ్ రాజకీయ జీవితం ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ జరిగిన ఘటన తర్వాత విజయ్ తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. జరిగిన ఘటనను వివరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో ఉన్న విషయాలు బయటపడిన నేపథ్యంలో విజయ్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన నటించిన చివరి సినిమా జననాయగన్ విడుదలకు నోచుకోలేదు. జనవరిలో విడుదల కావలసిన ఈ సినిమాకు అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. సెన్సార్ బోర్డు తీవ్రమైన ఇబ్బందులు పెట్టింది. ఈ నేపథ్యంలో అనేక రకాల అవాంతరాలను ఈ సినిమా ఎదుర్కొంది. చివరికి ఈ సినిమా ఓటి నుంచి కూడా అమెజాన్ ప్రైమ్ తప్పుకుంది. చివరికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అధిక స్థానాలు గెలిచిన నేపథ్యంలో ఈ సినిమాకు ఉన్న అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది.
పోలింగ్ కు మరో 3 నెలల సమయం ఉందనగా విజయ్ భార్య విడాకుల విషయం తెరపైకి వచ్చింది. ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉంది. ఈ కేసు అకస్మాత్తుగా ఎన్నికల ముందు రావడంతో విజయ్ రాజకీయ భవితవ్యం ఒత్తిడిలో పడింది. అటు తొక్కిసలాటలో 41 మంది చనిపోవడం.. జననాయగన్ సినిమా విడుదల కాకపోవడం.. భార్య విడాకుల అంశం.. ఇంకా అనేక ఇబ్బందులు విజయ్ ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ప్రతి ఇబ్బందిని కూడా విజయ్ తన అభిమానులకు తెలియజేశాడు. తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్.. దానిని ఓటు బ్యాంకుగా మలుచుకున్నాడు. అందువల్లే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అత్యధిక సీట్లు సాధించి.. తమిళనాడులో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు.