Homeజాతీయ వార్తలుTelangana Elections 2023: హంగ్‌ వస్తే అనూహ్య మైత్రి.. సీఎం ఎవరవుతారో తెలుసా?

Telangana Elections 2023: హంగ్‌ వస్తే అనూహ్య మైత్రి.. సీఎం ఎవరవుతారో తెలుసా?

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. మెజార్టీ సర్వే సంస్థలు కాంగ్రెస్‌కు పట్టం కట్టినా.. బీఆర్‌ఎస్‌ ఈ సర్వే అంచనాలతో ఏకీభవించడం లేదు. పోలింగ్‌ శాతం గతం కంటే తగ్గటంతో కాంగ్రెస్‌ కూడా చివరి నిమిషంలో అలర్ట్‌ అవుతోంది. ఇదే సమయంలో బీజేపీకి వచ్చే సీట్లు కీలకం కానున్నాయి. హంగ్‌ వస్తే ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారు.. సంకీర్ణ సర్కారులో సీఎం అయ్యేది ఎవరు అన్న చర్చ మొదలైంది. మరోవైపు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు తెరవెనుక రాజకీయం మొదలు పెట్టాయి.

ఎవరి ధీమా వారిదే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. అధికారంపైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ చివరి నిమిషం వరకు ధీమా వ్యక్తం చేశాయి. కానీ, మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌కే మద్దతుగా నిలిచాయి. కొన్ని బీఆర్‌ఎస్‌కు ఛాన్స్‌ ఉందని అంచనా వేశాయి. ఇక ఒకటి రెండు సర్వేలు హంగ్‌కు కూడా అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాయి. పోలింగ్‌ పూర్తి కాకుండా ఎగ్జిట్‌ పోల్స్‌ రావటం.. రాత్రి వరకు పోలింగ్‌ జరగడం.. గతం కంటే పోలింగ్‌ శాతం తగ్గడం.. తదితర అంశాలు ఇప్పుడు ఆసక్తికంగా మారాయి. హంగ్‌పై చర్చకు దారితీశాయి.

సంకీర్ణ సీఎం ఎవరో..
బీఆర్‌ఎస్‌కు మెజారిటీ వస్తే కేసీఆర్‌ సీఎం అవుతారు. కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తే రేవంత్‌రెడ్డి లేదా భట్టి విక్రమార్క లేదా జానారెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డిలో ఎవరో ఒకరు సీఎం అవుతారు. మరి హంగ్‌ వస్తే సీఎం ఎవరు అన్నది కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో హంగ్‌ అవకాశం ఉందని తుది పోలింగ్‌ శాతం తరువాత చర్చ మొదలైంది. సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం కాంగ్రెస్‌ 56, బీఆర్‌ఎస్‌ 48 సీట్లు సాధిస్తుంది. అదే సమయంలో బీజేపీ 10, ఎంఐఎం 6 సీట్లు దక్కించుకొనే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారం దక్కించుకోవటానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ కాంగ్రెస్‌ లేదా బీఆర్‌ఎస్‌లో ఎవరికి వచ్చినా వాళ్లదే అధికారం.

కానీ, మ్యాజిక్‌ ఫిగర్‌కు కొద్దిగా దూరంగా ఏ పార్టీ నిలిచినా.. తెలంగాణ రాజకీయం కొత్త టర్న్‌ తీసుకోవటం ఖాయం. అధిక స్థానాలు సాధించిన పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం ఇస్తారు. ఆ సమయంలో పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్య నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచే మరో పార్టీ కనిపించటం లేదు.

బీఆర్‌ఎస్‌కు ఎంఐఎం..
కాంగ్రెస్‌కు అంచనా వేస్తున్నట్లుగా 60 లోపు సీట్లు వస్తే రాజకీయం మారటం ఖాయం. బీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మద్దతు ఖాయమనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఇప్పుడు ఎంఐఎం కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బీఆర్‌ఎస్‌కు మద్దతు అవసరమైతే ఎంఐఎం, బీజేపీలో ఇద్దరి నుంచి మద్దతు కోరే అవకాశం ఉంటుంది. అయితే ఎంఐఎం, బీజేపీ రెండు పార్టీలు ఒకే కూటమిలో ఉండే అవకాశం ఉండదు. దీంతో, బీజేపీ బయట నుంచి బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తుందనే తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ – బీజేపీ రెండు పార్టీల లక్ష్యం కాంగ్రెస్‌ కావటంతో బీజేపీ మద్దతుపై చర్చ జరుగుతోంది. ఇక ఎంఐఎం నేరుగా మద్దతు ఇవ్వకపోయినా..పరోక్షంగా సహకరించే అవకాశం ఉంది. ఈ నెల 3న వెల్లడయ్యే తుది ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోయినా..తెలంగాణ రాజకీయం మరింత ఉత్కంఠగా మారడం ఖాయం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version