సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ – కేంద్ర ప్రభుత్వం నడుమ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు అమలు చేయాలని కేంద్రం ఆదేశించినా.. ట్విటర్ ఇప్పటికీ తమ అంగీకారాన్ని తెలపలేదు. రెండు సార్లు తుది నోటీసులు అందుకున్నప్పటికీ.. ఇంకా ట్విటర్ యాజమాన్యం స్పందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్ ఖాతాను గంటపాటు నిలిపేసింది ఆ సంస్థ. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయాన్ని మంత్రి రవిశంకర్ స్వయంగా వెల్లడించారు. అమెరికాలో అమల్లో ఉన్న డిజిటల్ మిల్లేనియం కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడం వల్లనే అకౌంట్ తాత్కాలికంగా నిలిపేసినట్టు ట్విటర్ తెలిపిందని మంత్రి వెల్లడించారు.
ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు, 2021లోని రేఊల్ 4 (8)ను పూర్తిగా ఉల్లంఘించడమేనని మంత్రి అన్నారు. వ్యక్తిగత అకౌంట్ కు యాక్సిస్ నిరాకరించడానికి ముందు కనీసం నోటీసు ఇవ్వడంలో కూడా ట్విటర్ విఫలమైందని అన్నారు.
ఇక, కేంద్రం తీసుకొచ్చిన నూతన నిబంధనల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. ఎవ్వరైనా దేశంలో తీసుకొన్ని రూల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందులో ఎటువంటి రాజీకి ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. దేశంలో సంస్థ కార్యాలయం తెరవడం దగ్గర్నుంచి.. తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం, లేకపోతే అందుకు గల కారణాలను తెలియజేయడం వంటి నిబంధనలు ఉన్నాయి. మిగిలిన సామాజిక మాధ్యమాలు ఇందుకు అంగీకరించినా.. ట్విటర్ మాత్రం ఇంకా యాక్సెప్ట్ చేయలేదు.