అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనే ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్కు కోలుకోలేని దెబ్బపడింది. ట్రంప్, ఆయన సతీమణి మెలనియాకు కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ట్రంప్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. అయితే.. పలువురు దేశాధినేతలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేస్తుండగా.. కొంత మంది మాత్రం ఎగతాళి చేస్తున్నారు. తరచూ నోటి దురుసు ప్రదర్శించే ట్రంప్పై అదే స్థాయిలో సెటైర్లు వేస్తున్నారు. ఇక చైనీయులు మాత్రం మరింత రెచ్చిపోతున్నారు.
Also Read: రచ్చ రచ్చ, రసాభాసగా మారిన అమెరికా అధ్యక్ష డిబేట్
మొత్తానికి ట్రంప్ ఒక పాజిటివ్ వార్తను ట్వీట్ చేశారంటూ గూనర్ అనే ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశాడు. ‘దేవుడా.. దేవుడా.. మీరు మాకు కావాలి.. ఆయన్ని కాపాడండి, ప్లీజ్’ అంటూ మరొకరు సెటైర్ వేశారు. ‘అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ కొత్త నాటకానికి (సర్కస్)కు తెరతీశారు’ అంటూ మరికొందరు నెటిజన్లు విమర్శలు కురిపించారు. కోల్ గోర్మన్ అనే నెటిజన్ చేసిన ఓ ట్వీట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఆ స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది. ‘కొవిడ్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఈ వైరస్కు చివరికి ఎలాంటి గతి పట్టింది. అది త్వరగానే కోలుకుంటుందని ఆశిస్తున్నా..’ అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. చాలా మంది నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తూ తమ అక్కసు వెల్లబోస్తున్నారు. ‘అమెరికాలో కరోనా విలయానికి కారణమైన మీరు చివరికి తగిన మూల్యం చెల్లించుకున్నారు’ అంటూ మరికొంత మంది విమర్శలు కురిపించారు.
ట్రంప్ దంపతులకు కరోనా సోకిన విషయాన్ని చైనా అధికారిక మీడియా కూడా ప్రముఖంగా ప్రసారం చేసిందట. ఇక భారత్, చైనాపై తరచూ అక్కసు వెళ్లగక్కే చైనా వార్తా పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ మరో అడుగు ముందుకేసి విమర్శలు చేసింది. కరోనా వైరస్ పరిస్థితిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసినందుకు ట్రంప్ దంపతులు తగిన మూల్యం చెల్లించుకున్నారు అని ఆ పత్రిక సంపాదకుడు హూ షీజిన్ ట్వీట్ చేశాడు. అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయనకు ప్రతికూల ఫలితమే వస్తుందని అక్కసు వెళ్లగక్కారు.
Also Read: బీజేపీ స్ట్రాటజీ: పోయే వాళ్లు పోతారు.. ఉండేవాళ్లు ఉంటారు?
చైనా సోషల్ మీడియా ప్లాట్ఫాం అయిన వీబో యాప్లో ట్రంప్ కరోనా పాజిటివ్ వార్త కోసమే ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. ట్రంప్ను ఎగతాళి చేస్తూ కామెంట్లు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది. మరోవైపు ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు ఆచితూచి వ్యవహరించడమో.. కొంత లౌక్యంతో మాట్లాడడమో చేస్తేనే కదా ప్రజల నుంచి మద్దతు వచ్చేది. ఇప్పుడు కరోనా బారిన పడ్డామని ప్రకటించుకున్నా ట్రంప్ను అయ్యో పాపం అనే వారు కన్నా .. సెటైర్లు వేసే వారే ఎక్కవయ్యారనేది అర్థమవుతోంది