ప్రత్యేక తెలంగాణే సాధనగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి నేటితో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ తో టీఆర్ఎస్ 20ఏళ్ల ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. సోమవారం టీఆర్ఎస్ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పూలమాల వేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళ్లర్పించారు. అనంతరం టీఆర్ఎస్ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కే.కేశవరావు, హోంమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. నేతలంతారూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించారు.
టీఆర్ఎస్ ప్రస్థానం.. ప్రత్యేక రాష్టం ఏర్పాటు..
2001 ఏప్రిల్ 27న ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పని చేశారు. 2001 ఏప్రిల్ 21న డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి వారం రోజుల్లోనే ఆయన పార్టీ ప్రకటించారు. తదనంతరం అన్నివర్గాలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. 2001 మే 17న తెలంగాణ ‘సింహగర్జన’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. రాజకీయ పోరాటం ద్వారానే తెలంగాణ సాధిస్తామని నాడు కేసీఆర్ ప్రకటించారు. నాటి నుంచి కేసీఆర్ తనదైన రాజకీయ చతురతతో ముందుకెళ్లారు.
2009 నవంబర్ 29న ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ అమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం ఉద్యమంలో కీలక మలుపు తీసుకుంది. 2009 డిసెంబర్ 9న నాటి హోం మంత్రి చిదంబరం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీని తర్వాల ఆంధ్రా ప్రాంత నాయకులు పలు అడ్డంకులు సృష్టించినప్పటికీ తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగింది. లోక్సభలో ఫిబ్రవరి 18న, రాజ్యసభలో ఫిబ్రవరి 20న తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. మార్చి 1న తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి గెజిట్లో 2014 జూన్ 2 ‘అపాయింటెడ్ డే’ గా పేర్కొన్నారు. దీంతో జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.