తెలంగాణ జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితం తేలకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ముందుగా మినమమ్ ఓట్లు సాధించని వారిని ఎలిమినేట్ చేస్తుండగా.. ప్రధాన అభ్యర్థుల ఓట్ల లెక్కింపు నడుస్తోంది. ఏడు రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. సమీప ప్రత్యర్థి రామచందర్రావుపై టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి 8,021 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మొత్తం ఏడు రౌండ్లలో సురభి వాణీదేవికి 1,12,689 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచందర్రావుకు 1,04,668, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్కు 53,610, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554, టీడీపీ అభ్యర్థి ఎల్ రమణకు 5,973 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లలో చెల్లని ఓట్లు 21,309 గుర్తించారు. అభ్యర్థి విజయానికి ఇంకా 1,79,175 ఓట్లు కావాల్సి ఉంది.
మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50 శాతం ఓట్లు దాటకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ ఫలితం తేలకుంటే.. మూడో ప్రాధాన్యత ఓట్లను సైతం లెక్కించనున్నారు. దీంతో శనివారం రాత్రికి తుది ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు.
నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. శుక్రవారం ఉదయానికి మొత్తం ఏడు రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఏ అభ్యర్థికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇప్పటివరకు 33 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎలిమినేషన్ అభ్యర్థుల ఓట్లు మిగితా అభ్యర్థులకు జమ చేస్తున్నారు. ఇందులో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 124, తీన్మార్ మల్లన్నకు 115, కోదండరామ్కు 127 ఎలిమినేషన్ ఓట్లు జమయ్యాయి.
మరోవైపు.. ఇప్పటివరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,10,964, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 83,405, తెలంగాణ జన సమితి అభ్యర్థి కోదండరామ్కు 70,199 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి విజయం సాధించాలంటే 1,83,167 ఓట్లు అవసరం ఏర్పడింది. దీంతో తుది ఫలితం శనివారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.