చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీం కోర్టుకు చెందిన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూత్ర, మాజీ మంత్రి పి.నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని చేయాలని టీడీపీ […]

Written By: Srinivas, Updated On : March 19, 2021 2:37 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీం కోర్టుకు చెందిన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూత్ర, మాజీ మంత్రి పి.నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని చేయాలని టీడీపీ నేతలిద్దరూ ఏపీ హైకోర్టులో గురువారం క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అమరావతి భూముల విషయంలో సీఐడీ నమోదు చేసిన కేసు రద్దు చేయాలని, అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ.. మంగళగిరి సీఐడీ ఠాణా స్టేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈ నెల 16న సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

సెక్షన్‌ 41సీఆర్‌పీసీ కింద నోటీసులు అందజేసి, ఈ నెల 23న విజయవాడలోని కార్యాలయంలో విచారణకు రావాలని సూచించారు. అలాగే టీడీపీ నేత, మాజీ మంత్రి పి.నారాయణ సైతం ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. ఆయనకు సైతం బుధవారం సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించారు. మోసం, కుట్రతో అసైన్డ్‌ భూములు లాక్కున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత 24న సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు, నారాయణపై ఎస్సీ, ఎస్టీ చట్టం సహా 10 సెక్షన్ల కింద సీఐడీ అధికారులు ఈ నెల 12న కేసు నమోదు చేశారు.

చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌), (జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సీఐడీ.. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణను ఏ2గా పేర్కొన్నారు. అలాగే కొంత మంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు పొందుపరిచింది. ఈనెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ రీజనల్ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని చంద్రబాబుకు నోటీసులిచ్చిన అధికారులు.. విచారణకు హాజరుకాకపోయినా, విచారణలో వెల్లడించిన విషయాలతో సంతృప్తి చెందకపోయినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. మరోవైపు ఇదే కేసులో తన దగ్గరున్న ఆధారాలను సమర్పించాలని సీఐడీ.. ఎమ్మెల్యే ఆర్కేకు నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరయ్యారు. సీఐడీ అధికారులకు ఆయన దగ్గరున్న ఆధారాలను అందించారు.