CM KCR: తాము చేస్తే సంసారం.. ఎదుటి వాళ్లు చేస్తే వ్యభిచారం అన్న చందంగా ఉంది తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు. కేంద్ర హోం మంత్రి అమిత్షా ఇటీవల హైదరాబాద్కు వచ్చారు. సికింద్రాబాద్లోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఓ కార్యకర్త ఇటికి వెళ్లారు. ఈ సమయంలో ఇరుకు సందుల్లోకి కారు వెళ్లకపోవడంతో చెప్పులు దూరంగా విడిచి వెళ్లారు. తిరిగి వస్తుండగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సజంయ్కుమార్.. కాస్త ముందువెళ్లి.. అమిత్షాకు చెప్పులు అందించారు. దీనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంకేముందు కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా గులాబీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులతోపాటు హోదా ఉన్నోడు లేనోడు కూడా బండి సంజయ్పై విమర్శల దాడి మొదలు పెట్టారు. ముఖ్యమైన మంత్రి… బీజేపీ నేతలు ట్విట్టర్ టిల్లుగా పిలిచే ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ అయితే తెలంగాణ బీజేపీ నేతలు.. గుజరాతీలకు గులాంలు అంటూ వీడియోను పోస్టు చేశారు. అధికార పార్టీ విప్, దళిత ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా బండి సంజయ్ గుజరాతీ గులాం.. చెప్పులో మోయడమే ఆయన నైజం అంటూ తీవ్ర రోపణలు చేవారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తాము కూడా తగ్గేదే లే అన్నట్లుగా విమర్శల దాడి చేశారు.

తిప్పికొట్టిన కమలనాథులు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర హోం మంత్రి అమిత్షాకు చెప్పులు అందించిన ఉదంతంపై అధికార టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల విమర్శల దాడిని బీజేపీ నేతలు సమర్థవంతంగానే తిప్పి కొట్టారు. బీజేపీ స్టేట్చీఫ్ బండి సంజయ్ స్వయంగా ప్రెస్మీట్ పెట్టారు.. ‘పెద్దవారికి చెప్పులు అందించడం భారతీయుల సంస్కృతి.. దీనిని కూడా వక్రబుద్ధితో చూసే టీఆర్ఎస్ నాయకులు వారి సంకుచిత బుద్ధిని బయటపెట్టుకున్నారు. చెప్పులు మోయడానికి, చెప్పులు అందించడానికి తేడా తెలియని వెదవలు. అయినా చెప్పులు మోయడం.. కాళ్లు పట్ట లాగడం టీఆర్ఎస్ నేతలకు అలవాటే’ అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో గులాబీ నేతలు కాస్త వెనక్కు తగ్గారు.
సీఎం కాళ్లు మొక్కిన గిరిజన ప్రజాప్రతినిధులు..
అమిత్షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పులు అందించిన ఘటనపై విమర్శలు చేసిన టీఆర్ఎస్ నేతలు నెల తిరక్కుండానే బుక్కయ్యారు. బీజేపీ నాయకులు దొరగా సంబోధించే సీఎం కె.చంద్రశేఖర్రావు.. గిరిజన మంత్రి సత్యవతిరాథోడ్, గిరిజన ఎమ్మెల్యే శంకర్నాయక్, గిరిజన ఎంపీ మాలోతు కవితతోపాటు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డితో కాళ్లు మొక్కించుకున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో ఈ దృశ్యం చోటుచేసుకుంది.

ట్రోల్ చేస్తున్న విపక్షాలు..
ఆదివాసీ, బంజారా భవన్ ప్రారంభించిన కేసీఆర్, తర్వాత గిరిజనులు, బంజారాలతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన మంత్రితోపాటు, ఎంపీ, ఎమ్మెల్యేతో సీఎం కాళ్లు మొక్కించుకున్నారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్ కాళ్లు మొక్కుతుండగా వారిని కనీసం వారించే ప్రయత్నం కూడా కేసీఆర్ చేయలేదు. మంత్రి సత్యవతి పాదాభివందనం చేసే సమయంలో మాత్ర కాస్త వారించే ప్రయత్నం చేసినట్లు కనిపించారు. అయినా భారీకాయం ఉన్న మంత్రి ఇబ్బంది పడుతూనే ముఖ్యమంత్రి కాళ్లు మొక్కారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని విపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతలు ట్రోల్ చేస్తున్నారు. గుజాతీలకు గులాంలు అని తమపై విమర్శలు చేసిన ట్విట్టర్ టిల్లు.. బాల్క సుమన్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. గిరిజనులు ఆత్మగౌరవాన్ని దొర కాళ్ల వద్ద పెట్టారని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. బానిస బతుకులు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంకొందరు శంకర్నాయక్కు మళ్లీ టికెట్ రావాలంటే.. సత్యవతి రాథోడ్కు మళ్లీ మంత్రి పదవి ఇవ్వాలన్నా.. ఎంపీగా ఉన్న కవితకు వచ్చే ఎన్నికల్లో అయినా.. తనకు ఎమ్మెల్యే టికెట్తోపాటు మళ్లీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వాలని ఇలా పాదాభివందనం చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది బానిసత్వం కాదా అని గిరిజన సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.