లాక్ డౌన్ టైంలో అటు ప్రజలకు ఇటు పోలీసులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో లాక్ డౌన్ వేళ వాహనదారులను దూషించారని.. దాడిచేశారని.. డబ్బులు వసూలు చేశారనే వివిధ కారణాలతో పోలీసు సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ రూల్స్ ని అతిక్రమించిన వహణదారులపై బుధవారం ఒక్కరోజే 14427 కేసులు నమోదు చేశారు పోలీసులు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 1,475 ద్విచక్రవాహనాలు, 83 ఆటోలు, 234 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనంపై ఇద్దరు, ముగ్గురు ప్రయాణం చేస్తున్న వారిని, డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను, పత్రాలు లేని వాహనాలను, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేశారు.
అదే సమయంలో లాక్ డౌన్ వేళ వాహనదారులను దూషించారని.. దాడిచేశారని.. డబ్బులు వసూలు చేశారని నలుగురు పోలీసు సిబ్బందిపై ఆరోపణలు రావడంతో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్ వారిపై చర్యలకు ఉపక్రమించారు. లాఠీలకు పని చెప్పవద్దని.. సంయమనంతో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు చెబుతున్నా.. కొందరు కిందిస్థాయి సిబ్బంది వినడం లేదు. ఇలాంటి ఘటనలే గోల్కొండ, మొఘల్ పురా, షాద్ నగర్, చార్మినార్, పాతబస్తీలో చోటుచేసుకున్నాయి.