TPCC: ఆదుకుంటానని.. రైతులను నిండా ముంచారు.. గవర్నర్‌కు టీపీసీసీ ఫిర్యాదు..!

TPCC: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి చేస్తున్న అన్యాయంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కదం తొక్కింది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వానాకాలం పంటను కొనుగోలు చేయాలని ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. రోజుకో విధంగా ప్రభుత్వం తీరుపై తమ నిరసన గళాన్ని విప్పుతున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సారథ్యంలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. […]

Written By: Neelambaram, Updated On : December 2, 2021 4:34 pm
Follow us on

TPCC: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి చేస్తున్న అన్యాయంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కదం తొక్కింది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వానాకాలం పంటను కొనుగోలు చేయాలని ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. రోజుకో విధంగా ప్రభుత్వం తీరుపై తమ నిరసన గళాన్ని విప్పుతున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సారథ్యంలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. పారాబాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం చెబుతోందని, రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు మేమే కొంటామని రైతులను మోసం చేస్తుందని వివరించారు.

TPCC

రైతులను ఆదుకోండి..

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఏమన్నారంటే.. మొన్నటి వరకు కేంద్రంలోని బీజేపీతో టీఆర్ఎస్ అంటకాగిందని, రైతులు పండించిన ధాన్యం కొనాలని కోరితే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రైతులను కట్టడి చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కేంద్రం పునరాలోచించాలి..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ఇబ్బందులను అర్థం చేసుకుని వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు చాలా సంతోషమన్నారు. అదే విధంగా యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు అకాల వర్షాల వలన పంట నష్టపోయి తీవ్ర అప్పుల్లో కూరుకుపోయారని, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కూడా రైతుల గురించి మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అదే తమ ప్రభుత్వం ఉన్నప్పుడు తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

Also Read: బీజేపీలోకి మరో ఉద్యమ నేత.. తెరవెనుక ఉన్నదెవరు?

కాళేశ్వరం నీళ్లిచ్చిమంటూ.. వరి వేయొద్దంటారా..?

తెలంగాణ ప్రభుత్వం మాట్లాడితే తమ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని, 24 గంటల కరెంటు ఇస్తున్నాం.. కాళేశ్వరం నీళ్లు ఇచ్చామని చెప్పుకునే నాయకులు.. ఇప్పుడు వరి వేయొద్దని రైతులకు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అలాంటప్పుడు లక్షల కోట్లు ఖర్చుచేసి ప్రాజెక్టులు ఎందుకు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు శ్రీధర్ బాబు.. రాష్ట్రంలోని రైతుల సమస్యల పై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను పదవుల ఆశచూపి బలవంతంగా లాక్కున్నారని.. దీంతో తమకు అసెంబ్లీలో బలం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం కోసమే వచ్చిందా? అని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 70% ధాన్యం రైస్ మిల్లర్లు కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంతో ఫైట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు వస్తారా? అని సవాల్ విసిరారు.

Also Read: వారిద్దరు ‘చేయి’ కలిపినట్లేనా?

Tags