Chandrababu Bail
Chandrababu Bail: మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపాలని ఎల్లో మీడియా అనుకుంటోందా అంటే.. ఔననే సమాధానం వస్తోంది. ఇందుకు నిదర్శనంగా ఈనాడులో సింగిల్ కాలమ్ ప్రచురితమైన ఓ వార్త. స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయకుడు 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నారు. కంటి ఆపరేషన్ కారణంగా, కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. న్యాయ స్థానం మానవతా దృక్పథంతో ఆయనకు జైలు నుంచి విముక్తి కల్పించింది.
షరతులు ఉల్లంఘించేలా..
అయితే చంద్రబాబు నాయుడు షరతులు ఉల్లంఘిస్తున్నారని ఆయన అనూకూల మీడియానే ప్రచారం మొదలు పెట్టింది. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, మీడియాతో కేసు గురించి మాట్లాడొద్దని, కేవలం ఆరోగ్యపరమైన అంశాలకు మాత్రం బెయిల్ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయ స్థానం స్పష్టం చేసింది. కనీసం పైకి కనిపించేందుకైనా షరతులను పాటించాలి. చంద్రబాబు నివాసంలో ప్రతి రోజూ రాజకీయ కార్యకలాపాలు సాగుతున్న సంగతి అందరికీ తెలుసు. మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకోరు కదా.
ఓ అభిమాని అత్యుత్సాహం..
ఇదిలా ఉండగా, చంద్రబాబును కలిసిన అత్యుత్సాహంలో ఒక టీడీపీ అభిమాని, అందుకు సంబంధించిన ప్రకటన ఇచ్చారు. ముందూవెనుకా ఆలోచించకుండా ఈనాడు పత్రిక దాన్ని ప్రచురించడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు అరెస్టయిన తర్వాత ఆయనకు సంఘీభావంగా ఒక సంస్థ తెలుగువీర లేవరా బాబు కోసం కదలిరా అనే పాటను తీసుకొచ్చారు. ఈ పాట విజయోత్సవ సభను 11వ తేదీన విశాఖలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను చంద్రబాబుతో ఆయన నివాసంలో ఆవిష్కరింపజేశారు. ఇంత వరకూ ఓకే. ఈ సమాచారాన్ని బయటికి పంపడం ద్వారా.. చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించారని ఈనాడు పరోక్షంగా తెలిపింది. చూస్తుంటే రామోజీరావు బాబును తిరిగి జైల్లోపలకి పంపాలని చూస్తున్నారా అని అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.