CM Vijay political story: ఎన్నికల్లో మెజారిటీ స్థానాల వచ్చాయి. అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీ పెట్టిన ప్రారంభ సంవత్సరంలోనే అధికారం దక్కింది అనుకుంటుండగా.. అనుకోని అవాంతరాలు.. రాజకీయ అనుభవం లేదు. రెండుసార్లు గవర్నర్ వద్దకు వెళ్తే తిరస్కారం ఎదురయింది. మరోవైపు ఏఐడీఎంకే, డీఎంకే నేతలు చర్చలు జరుపుతున్నారు. అధికారాన్ని సొంతం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా బద్ధ శత్రువులైన ఈ రెండు పార్టీలు పేరుకు ద్రావిడ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకువచ్చి.. అధికారాన్ని పంచుకునే కుట్ర చేశారు. ఇవన్నీ కూడా విజయ్ చూస్తూనే ఉన్నాడు. ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. మహాబలిపురంలో తన ఎమ్మెల్యేలను రిసార్ట్ లో ఉంచాడు.
రాజకీయంగా అనుభవం లేదు. అలాగని అధికారాన్ని దక్కించుకోకుండా వదిలిపెట్టే సవాల్ లేదు. ఒకవేళ డీఎంకే, అన్నా డీఎంకే కలిసిపోతే మూకుమ్మడిగా తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని అనుకున్నాడు. ప్లాన్ ఏ తో పాటు, ప్లాన్ బీ కూడా అమలు చేయాలని గట్టిగా అనుకున్నాడు.. దానికంటే ముందు తనదైన స్టైల్ లో రాజకీయాన్ని మొదలుపెట్టాడు. అచ్చం సర్కార్ సినిమా మాదిరిగా ఎత్తులు వేశాడు. ఇక్కడ లౌక్యం ప్రదర్శించాడా.. మరొకటి ఏమైనా చేశాడా అనే విషయాన్ని పక్కన పెడితే.. విజయ్ తన అసలు సిసలైన రూపాన్ని ప్రదర్శించాడు. ఫలితంగా తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు.
విజయ్ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. సిపిఐ తల ఊపింది. సిపిఎం ఒప్పుకుంది. సి వి కే చేయి ఎత్తి జై కొట్టింది. ఫలితంగా విజయ్ పార్టీ బలం 118 స్థానాలకు చేరుకుంది. గవర్నర్ పెట్టిన మెలికతో విజయ్ ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలోనే సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీల మద్దతు కోరాడు. గవర్నర్ చెప్పినట్టుగానే ఆ పార్టీలు కూడా మద్దతు లేఖలిచ్చాయి. దీంతో విజయ్ పార్టీ బలం ఏకంగా 118 కి పెరిగింది. ప్రభుత్వ ఏర్పాటు కావలసిన 117 సభ్యుల కంటే ఒక సీటు అధికంగానే వచ్చింది. విజయ్ రెండు స్థానాల్లో విజయం సాధించాడు. కాబట్టి ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో తమిళనాడు అసెంబ్లీ సభ్యుల బలం 233 కు చేరుకుంటుంది. అలాంటప్పుడు సభలో మెజారిటీ 117 సరిపోతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన మెజారిటీని విజయ్ సంపాదించాడు. ఫలితంగా రీల్ హీరో కాస్త.. రియల్ హీరో అయిపోతున్నాడు.
గవర్నర్ విధించిన అనేక నిబంధనల వల్ల విజయ్ చాలా ఇబ్బంది పడ్డాడు. సెక్యూరిటీ కాన్వాయ్ తో గవర్నర్ వద్దకు వెళ్లిన తర్వాత.. అక్కడ తిరస్కారం ఎదురైంది. దీంతో అధికారులు కాన్వాయ్ ను రద్దు చేశారు. ఆ సమయంలో విజయ్ పడిన మానసిక వేదన మాటలకు అందనిది. అయినప్పటికీ ఓర్పుతో ఇవన్నీ భరించాడు. ప్రశాంతంగా రాజకీయాలను సున్నితంగా చేశాడు. చివరికి గవర్నర్ కోరినట్టుగానే మద్దతు లేఖలను సంపాదించగలిగాడు. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 117 ఎమ్మెల్యేల బలాన్ని సాధించగలిగాడు. గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే రేపు లేదా ఎల్లుండి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తాడు. అంతే కాదు, కాంగ్రెస్ పార్టీకి రెండు మంత్రి పదవులు.. మిగతా పార్టీలకు ఒక్కొకటి చొప్పున మంత్రి పదవి ఇచ్చేందుకు విజయ్ సుముఖత వ్యక్తం చేశాడు.