రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య లేఖల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై కేంద్రానికి గతంలోనే ఓ లేఖ రాసిన ఏపీ సీఎం జగన్.. ఇప్పుడు మరోసారి లేఖ రాశారు. ఈ సారి మరింత పొడవుగా.. మరింత బలమైన పదాలతో వ్యాఖ్యానాలు సంధించారు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని కోరారు. అంతేకాదు.. రెండు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి ప్రాజెక్టులకు ఉన్న అధికారాలను కృష్ణాబోర్డు పరిధిలోకి తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేశారు.
అంతేకాదు.. ఈ లేఖలో విభజన చట్టాన్ని కూడా ప్రస్తావించారు. ఈ చట్టాన్ని తెలంగాణ గౌరవించట్లేదని చెప్పారు. ఈ విషయమై ఎన్నిసార్లు కృష్ణాబోర్డు, కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదులు చేసినా.. సమస్యలు పరిష్కారం కావట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ సమస్య ఆలకించాలని, వెంటనే ఈ విషయమై స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే.. రెండు సార్లు ముఖ్యమంత్రి లేఖ రాసినా.. ప్రధానమంత్రి ఒక్కసారి కూడా స్పందించలేదు. కేంద్ర జలశక్తి నుంచి కూడా ఎలాంటి రెస్పాన్సూ లేదు. అయితే.. దీనికి కారణం ఉందని అంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సాగుతున్నది అసలైన జలవివాదం కాదని, ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయం చేస్తున్నారని కేంద్రం భావిస్తోందట. ఈ కారణంగానే.. సమాధానం ఇవ్వలేదని అంటున్నారు విశ్లేషకులు.
దీనికి పలు ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ తో సఖ్యత కొనసాగించింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిపి విందుల్లోనూ పాల్గొన్నారు. కానీ.. ఇప్పటి వరకు ఏపీకి దక్కాల్సిన వాటి గురించి ఒక్కసారి కూడా జగన్ మాట్లాడలేదని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటి గురించి ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించలేదని గుర్తు చేస్తున్నారు.
ఏపీకి దాదాపు 7 వేల కోట్ల రూపాయల కరెంట్ బకాయిలు ఇప్పటి వరకు అందలేదు. దీనిపై గత ఏపీ సర్కారు తెలంగాణ విద్యుత్ సంస్థలపై దివాలా పిటిషన్ వేసింది. కానీ.. ఈ ప్రభుత్వం రాగానే దాన్ని ఉపసంహరించుకుంది. నిధులు కూడా అడగలేదు. ఇప్పుడు కూడా.. కృష్ణా బోర్డు నీరంతా సముద్రం పాలవుతుంటే.. లేఖలతో కాలం వెళ్లదీస్తున్నారే తప్ప, సీఎం జగన్ నేరుగా ఈ విషయమై ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎందుకిలా చేస్తున్నారని నిలదీసింది లేదు. ఇదంతా కేసీఆర్ తో కుదుర్చుకున్న రాజకీయ అవగాహనే అని అంటున్నారు. వీళ్లిద్దరూ మిత్రులే అని, పైకి మాత్రం రాజకీయం చేస్తున్నారని కేంద్రం గుర్తించిందని చెబుతున్నారు విశ్లేషకులు. మోడీ స్పందించకపోవడానికి రీజన్ ఇదేనని అంటున్నారు.