BJP Vs KCR
BJP Vs KCR : తెలంగాణలో ఈసారి ఎలాగైనా కల్వకుంట్ల చంద్రశేఖర్రావును గద్దె దించాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇక కేసీఆర్ కూడా కేంద్రంలో బీజేపీని ఓడించాలని పావులు కదుపుతున్నారు. ఇరు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో ఇటు తెలంగాణ, అటు జాతీయ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వొద్దన్న లక్ష్యంతో కేసీఆర్ వేస్తున్న ఎత్తులకు కమలనాథులు కూడా పైఎత్తు వేస్తున్నారు. తెలంగాణలో ముందస్తుకు వెళ్లాలన్న కేసీఆర్ను అడుగు ముందుకు వేయకుండా చేశారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా ఇవ్వకుండా దెబ్బకొట్టాలని చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది బీజేపీ జాతీయ నాయకుల నుంచి. కేసీఆర్పై బీజేపీ భారీ వర్కవుట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, ఏపీ బీజేపీ నేత టీజీ.వెంకటేశ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లోక్సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు..
తెలంగాణలో లోక్ సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగినా జరగవచ్చని టీజీ.వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. గతంలో ఎన్నికలు షెడ్యూల్ కంటే వెనక్కి పోయినట్లే ఈసారి ముందుకు కూడా పోవచ్చని అన్నారు. అంతా కేసీఆర్ అనుకున్నట్లే మాత్రం జరగదని క్లారిటీ ఇచ్చారు. గతంలో కేసీఆర్ ముందస్తుకు వెళ్తే ఢిల్లీ పెద్దలు ఎలక్షన్స్ నిర్వహించారు. ఈసారి లోక్సభతోపాటే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నారు.
అంతిమ నిర్ణయం హస్తినలోనే..
రాజకీయాల్లో ఎవరి పంతాలు వారికి ఉంటాయని, అంతిమంగా నిర్ణయం తీసుకునేది ఢిల్లీ నేతలే అని టీజీ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. 2018లో కేసీఆర్ ఎన్నికలకు వెళ్లడం వెనుక లోక్ సభతో పాటే ఎన్నికలు జరిగితే అది మోడీకి అడ్వాంటేజ్ అవుతుందని భావించే అసెంబ్లీని రద్దు చేసుకుని మందుస్తుకు వెళ్లారనే చర్చ జరిగింది. ఈసారి ముందస్తుకు వెళ్లకపోయినా షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్లోనే ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఐదు నెలల వ్యత్యాసం ఉంది. సో ఈ సారి కూడా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగడం వల్ల ప్రచార సమయంలో రాష్ట్ర సమస్యలపైనే డిబేట్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇంతలో టీజీ.వెంకటేశ్ చేసిన కామెంట్స్ చర్చనీయాశంగా మారాయి.
BJP Vs KCR
అసలే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నిజంగానే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు లోక్సభ ఎలక్షన్స్తోపాటే జరుగుతాయా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈమేరకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ స్కెచ్ వేస్తోందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వచ్చే ఎన్నికలు కేసీఆర్కు ముళ్ల కిరీటం కావడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రధాని పదవిపై కన్నేసిన కేసీఆర్కు తెలంగాణలో గెలవడమే కష్టం అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. మరి పరిణామాలు ఎలా మారతాయో చూడాలి..!