Karnataka Election 2023: కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి పనిచేసిన అంశాలు ఇవే..

కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటకపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ జాతీయ నాయకుడు దేశవ్యాప్తంగా ‘జోడో యాత్ర’ పేరిట పాదయాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ యాత్రను 140 రోజుల పాటు నిర్వహించారు.

Written By: Srinivas, Updated On : May 13, 2023 4:25 pm
Follow us on

Karnataka Election 2023: వరుస ఓటములు.. అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ పని ఇక అయిపోయింది.. అన్న తరుణంలో కర్ణాటక ఫలితాలు బూస్టునిచ్చాయి. ఈ ఏడాది ఉత్తరాదిలో హిమాచల్ ప్రదేశ్, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రాల్లో హస్తం హవా సాగడంతో ఆ పార్టీ నేతల్లో మనో ధైర్యాన్ని పెంచాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మరింత సమర్థ వంతం పనిచేయడానికి మార్గం చూపాయి. ఇలాగే కష్టపడితే దేశంలో అధికారంలోకి రావడం పెద్ద విషయం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి అనుకూలించిన అంశాలేంటి? ఇక్కడ గెలుపునకు పార్టీ తీసుకున్న నిర్ణయాలేంటి? అనే విషయాలు ఇప్పుడు హాట్ హాట్ గా చర్చకు వస్తున్నాయి.

కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటకపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ జాతీయ నాయకుడు దేశవ్యాప్తంగా ‘జోడో యాత్ర’ పేరిట పాదయాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ యాత్రను 140 రోజుల పాటు నిర్వహించారు. ఇందులో అత్యధికంగా కర్ణాటకలో 21రోజుల పాటు నడిచారు. మొత్తం 511 కిలోమీటర్ల పాటు మైసూరు, మాండ్య, తమకూరు, చిత్ర దుర్గ తదితర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి యాత్ర సాగించారు. మాండ్య నియోజకవర్గంలో జోడో యాత్ర సాగిన తరుణంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా కలిసి వచ్చారు.

కుంటుంబ పాలన అనే ముద్ర పడిన కాంగ్రెస్ కు ఆ పేరు తొలగించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా గాంధీయేతర కుటుంబం నుంచి నేతను ఎన్నుకుంది. ఈ క్రమంలో దక్షిణాది నుంచి అయితే బెటరని ఆలోచించి మల్లిఖార్జున ఖర్గేకు అవకాశం ఇచ్చారు. ఆయనకు ఈ పోస్టు ఇవ్వడంతో కర్ణాటక కాంగ్రెస్ లో కొంత మార్పు వచ్చింది. అంతకుముందు వర్గ విభేదాలు ఉండడంతో ఆ తరువాత ఒక్క తాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ అనగానే ప్రతి రాష్ట్రంలో అంతర్గత విభేదాలు ఉంటాయి. అయితే వీటిని సరిచేయడం నేతల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ లో ఓ వైపు సిద్ధారామయ్య, మరోవైపు డీకే శివకుమార్ లకు సమ ప్రాధాన్యం లభించింది. దీంతో ఎవరు సీఎం అన్న వివాదం మొదలైంది. అయితే పార్టీ గెలుపు కోసం వీరిద్దరు చేతులు కలిపారు. ఊరు, వాడా తిరుగుతూ పార్టీ కోసం శ్రమించారు. మొత్తంగా విజయం సాధించారు.

కర్ణాటకలో 2018లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో పాలనపై దృష్టి పెట్టకుండా రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత బీజేపీ అధికారం మార్చుకున్నా పరిస్థితిలో మార్పులేదు. ఈ తరుణంలో ప్రజల సంక్షేమ పథకాల విషయంలో కాంగ్రెస్ ప్రత్యేక శ్రద్ద పెట్టింది. తాము అధికారంలోకి వస్తే గృహజ్యోతి పథకం కింద 1.5 కోట్ల మంది గృహిణులకు రూ.2000 నెలకు సాయం చేస్తామని ప్రకటించింది. అన్న భాగ్య పథకం కింద 10 కిలోల ఉచిత బియ్యం, యువనిధి యోజనక కింద నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.3000, రూ.1,500 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని తెలిపింది. ఈ పథకాలే కాంగ్రెస్ ను విజయం వైపుకు తీసుకెళ్లాయని తెలుస్తోంది.