Operation Sindoor Army update: జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి భారత భద్రతా వ్యవస్థను కలచివేసిన సంఘటన. దీనికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్ర స్థావరాలపై ఖచ్చితమైన దాడులతో చరిత్రలో నిలిచిపోయింది. తర్వాత పాకిస్తాన్ జరిపిన దాడులనూ భారత్ తిప్పికొట్టింది. పాకిస్తాన్లోని 11 ఎయిర్బేస్లను ధ్వంసం చేసింది. తీవ్ర నష్టంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో డీజీఎంవో స్థాయి చర్చలతో సీజ్ఫైర్ జరిగింది. అయితే ఈ ఆపరేషన్ గురించి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల ఢిల్లీలో జరిగిన ’ఆపరేషన్ సిందూర్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్’ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా కీలక వివరాలను వెల్లడించారు. ఈ ఆపరేషన్ కేవలం మూడు రోజుల్లో ముగియలేదని, చాలా కాలం కొనసాగిందని తెలిపారు.
సామర్థ్యాన్ని చాటిన ఆపరేషన్ సిందూర్..
ఆపరేషన్ సిందూర్ భారత సైన్యం ఆధునిక యుద్ధ వ్యూహాలను, కచ్చితమైన గుర్తింపు, వేగవంతమైన దాడుల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్ మద్దతుతో కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి ఈ ఆపరేషన్ ఒక గట్టి హెచ్చరికగా నిలిచింది. జనరల్ ద్వివేది ప్రకారం, ఈ ఆపరేషన్ ద్వారా కీలక ఉగ్ర స్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఇది భారత సైన్యం శక్తి, సమన్వయాన్ని హైలైట్ చేస్తుంది. సరిహద్దు వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన సరిహద్దు భద్రత పట్ల దృఢమైన నిబద్ధతను చాటింది.
సైనిక సహకారం, సాంకేతిక పురోగతి..
ఆపరేషన్ సమయంలో సాయుధ దళాల సమన్వయం అసాధారణమైనదని జనరల్ ద్వివేది ప్రశంసించారు. వివిధ దళాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఈ ఆపరేషన్ విజయానికి కీలకమైన అంశం. అదనంగా, డ్రోన్ సాంకేతికతపై జీఎస్టీ తగ్గింపు వంటి కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు భారత సైనిక ఆధునీకరణకు ఊతమిచ్చాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్కరణలు భవిష్యత్ ఆపరేషన్లలో సాంకేతిక ఆధిపత్యాన్ని సాధించడానికి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సిందూర్ ఫలితంగా భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తాత్కాలికంగా తీవ్రతరమయ్యాయి. అయితే, పాకిస్తాన్ అభ్యర్థన మేరకు భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడం ద్వారా దౌత్యపరమైన సమతుల్యతను పాటించింది. శాంతి స్థాపనకు కూడా భారత్ కట్టుబడి ఉందని నిరూపించింది.
మొత్తంగా ఆపరేషన్ సిందూర్ భారత సైన్యం వ్యూహాత్మక శక్తి, సాంకేతిక సామర్థ్యం, ఉగ్రవాదంపై దృఢమైన వైఖరిని స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్ భారత భద్రతా వ్యవస్థకు ఒక మైలురాయిగా నిలిచింది.