Haryana and Kashmir Elections : హర్యానా రాష్ట్రంలో గత రెండు పర్యాయాలు బిజెపి అధికారంలో ఉంది.. అయితే ఈసారి ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రాదని రాజకీయ పండితులు జోస్యం చెప్పారు.. అవసరమైతే హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రకటించారు. ఇక ఎగ్జిట్ పోల్స్ అయితే బిజెపికి వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో అంతా బిజెపి పని అయిపోయిందని అంచనాకొచ్చారు. ఈసారి అధికారం దక్కించుకోలేదని అభిప్రాయపడ్డారు. కానీ అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. హంగ్ అనే అభిప్రాయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మొత్తంగా కమలం పార్టీ మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది. హ్యాట్రిక్ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.. అయితే ఇక్కడ హంగ్ ఏర్పడుతుందని కొందరు వ్యాఖ్యానించారు. కొన్ని సంస్థలు అయితే హంగ్ ప్రభుత్వం తథ్యం అని భావించాయి. కానీ వాస్త ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. భారతీయ జనతా పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇప్పటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫలితంగా మూడోసారీ కమల వికాసం సాధ్యమైంది.
జమ్ము కాశ్మీర్లో
హర్యానా విషయం పక్కన పెడితే జమ్మూ కాశ్మీర్ లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశం మొత్తం ఒకరకంగా ఉంటే.. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు మరొక రకంగా ఉంటాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదం కాస్త తగ్గింది.. అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకోవడంతో ప్రజల అభిప్రాయాలు మారిపోయాయి. అందుకు ఉదాహరణే ఇటీవల ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ + నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిగా ఏర్పడి 49 స్థానాలను గెలుచుకున్నాయి.. బిజెపి 29 స్థానాలలో విజయం సాధించింది. పిడిపి మూడు స్థానాలలో విజయం సాధించింది. ఇతరులు 9 స్థానాలలో గెలుపొందారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత సొంతంగా అధికారంలోకి వస్తామని బిజెపి భావించినప్పటికీ.. ఉపయోగం లేకుండా పోయింది. ఇక హంగ్ ఏర్పడుతుందని భావిస్తే.. కాంగ్రెస్ + నేషనల్ కాన్ఫరెన్స్ సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. జమ్ము కాశ్మీర్, హర్యానా ఎన్నికల్లో దేశ రాజకీయాలలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. హంగ్ అనే అంచనాలను తలకిందులు చేశాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది ఉండదని.. ప్రజల్లో నమ్మకం ఉంటే హ్యాట్రిక్ సాధ్యమనే సంకేతాలను ఇచ్చింది. కాగా, ఈ ఫలితాలు ప్రజాస్వామ్యంలో సరికొత్త చరిత్రను ఆవిష్కరించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More