తెలంగాణ.. ఊపిరి పీల్చుకో..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయాక కూడా తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమే. కానీ.. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌, తదుపరి పరిణామాలతో అప్పుల కుప్పైంది. దీనికి తోడు కరోనా వైరస్‌ రాష్ట్ర ఖజానాను పూర్తిగా దెబ్బతీసింది. ప్రపంచ దేశాలను కుదిపేసిన వైరస్‌ రాష్ట్రాన్నీ వదల్లేదు. కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. అన్‌లాక్‌తో ఇప్పుడిప్పుడే ఖజానా నిండుతున్నట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్‌‌ నెలతో అన్‌లాక్‌ 4 ఓపెన్‌ అయింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులే […]

Written By: NARESH, Updated On : September 3, 2020 6:07 pm
Follow us on

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయాక కూడా తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమే. కానీ.. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌, తదుపరి పరిణామాలతో అప్పుల కుప్పైంది. దీనికి తోడు కరోనా వైరస్‌ రాష్ట్ర ఖజానాను పూర్తిగా దెబ్బతీసింది. ప్రపంచ దేశాలను కుదిపేసిన వైరస్‌ రాష్ట్రాన్నీ వదల్లేదు. కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. అన్‌లాక్‌తో ఇప్పుడిప్పుడే ఖజానా నిండుతున్నట్లు కనిపిస్తోంది.

సెప్టెంబర్‌‌ నెలతో అన్‌లాక్‌ 4 ఓపెన్‌ అయింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. అన్నీ ఓపెన్‌ అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా సాధారణ స్థితికి చేరుకుంటోంది. లాక్‌డౌన్‌తో ఐదు నెలలుగా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి ఆగస్టు నెల కొంత ఉత్సాహాన్ని కల్పించింది. ఆగస్టు నెలలో అన్ని రకాల ఆదాయాలు కలుపుకొని రూ.13 వేల కోట్ల వరకు వచ్చింది. ఎక్సైజ్‌, రిజిస్ర్టేషన్‌, వాణిజ్య పన్నుల శాఖల నుంచి గతంలో అంత కాకున్నా.. చెప్పుకునే స్థాయిలోనే ఆదాయం వచ్చింది. దీంతో మళ్లీ అప్పులకు పోవాల్సిన ముప్పు తప్పింది.

లాక్‌డౌన్‌తో ఏప్రిల్‌లో ఏకంగా 83 శాతం ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఆ నెలలో కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా కూడా కలుపుకుని వచ్చింది రూ.3,377 కోట్లు మాత్రమే. ఆ తర్వాత కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది. ఆంక్షలు సడలించిన తర్వాత జూన్‌లో రూ.6,975 కోట్లు వచ్చింది. మరో రెండు నెలల తర్వాత ఇది రెట్టింపైంది. మద్యం అమ్మకాలు సాధారణ స్థితికి వచ్చాయి. దీంతో ఆదాయం పెరుగుతూ వచ్చింది.

దేశం మొత్తం మాంద్యం గుప్పిట్లో చిక్కుకుంటోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నా.. హైదరాబాద్‌లో మాత్రం ఆస్తుల లావాదేవీలు ఆశాజనకంగా సాగుతున్నాయి. ఆగస్టులో మద్యం, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7 వేల కోట్లకు ఆదాయం వచ్చింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో నిర్మాణ రంగంతోపాటు ఇతర రంగాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో హోటళ్లు, ఇతర సేవా రంగాల కార్యకలాపాలు పుంజుకునే అవకాశాలూ లేకపోలేవు. కరోనాకు ముందు అంచనా వేసిన బడ్జెట్ అంచనాల ప్రకారం ఇంకా రాకున్నా మరో రెండు నెలల్లో ఆ స్థాయి ఆదాయం వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.