AP Caste Census: ఏపీ సర్కార్ సాహసం.. కలిసి వస్తుందా?

రాష్ట్ర వ్యాప్తంగా కుల గణనను వారం రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టు కింద వేర్వేరు చోట్ల కుల గణన చేపట్టారు. ఈనెల 27 నుంచి డిసెంబర్ 3 వరకు వారం రోజులపాటు ప్రతి ఇంటిని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు జల్లెడ పట్టనున్నారు.

Written By: Dharma, Updated On : November 23, 2023 10:57 am

AP Caste Census

Follow us on

AP Caste Census: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలక్షన్ ఫీవర్ నెలకొంటోంది. వైసీపీ సర్కార్ కు మరో నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉంది. అందుకే కీలక నిర్ణయాలు దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఏపీలో కుల గణన ప్రక్రియ ప్రారంభమైంది. దీనిని మరింత వేగవంతంగా పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కుల గణనకు సంబంధించి సచివాలయాలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా కుల గణనను వారం రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టు కింద వేర్వేరు చోట్ల కుల గణన చేపట్టారు. ఈనెల 27 నుంచి డిసెంబర్ 3 వరకు వారం రోజులపాటు ప్రతి ఇంటిని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు జల్లెడ పట్టనున్నారు. మొత్తం 20 అంశాలకు సంబంధించి వివరాలు సేకరించనున్నారు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో లేకపోతే.. గణన పూర్తయిన తర్వాత.. మరో వారం రోజులు పాటు ఇటువంటి వారి కోసం సమయాన్ని కేటాయించనున్నారు. అయితే నేరుగా ఆ కుటుంబ సభ్యుల సచివాలయాలకు వెళ్లి వివరాలు అందించాల్సి ఉంటుంది.

ఈ కుల గణనకు సంబంధించి ప్రత్యేకమైన మొబైల్ యాప్ ను రూపొందించారు. వివరాలు సేకరించేటప్పుడు, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్క్రీన్ షాట్ కానీ, వీడియో రికార్డింగ్ చేసేందుకు వీలు లేకుండా ప్రత్యేక యాప్ ను రూపొందించారు. సర్వేలో భాగంగా చిరునామా, కుటుంబసభ్యుల సంఖ్య, వివాహ వివరాలు, కులం, ఉప కులం, మతం, రేషన్ కార్డు నెంబర్, విద్యార్హత, ఇంటి వివరాలు, వంట గ్యాస్ తో పాటుగా ఉపాధికి సంబంధించిన వివరాలు సేకరించనున్నారు.

ఈ కులగణన ప్రక్రియతో రాజకీయ లబ్ధి చేకూరుతుందని వైసీపీ సర్కార్ ఆశిస్తోంది. ఇప్పటికే బీసీ కులాల జాబితా విషయంలో కొన్ని సామాజిక వర్గాలకు ఉపశమనం కలిగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కుల గణన ప్రక్రియ చేపడుతుండడం విశేషం. అయితే పూర్తిస్థాయి మ్యానువల్ విధానంలో చేయాల్సి ఉన్న గణన.. మొబైల్ యాప్ లో రూపొందిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. దీని ద్వారా సక్రమమైన సమాచారం అందుతుందా? లేదా? అన్న అనుమానాలు ఉన్నాయి. అదే సమయంలో వలంటీర్లకు భాగస్వామ్యం చేయడంతో పక్కదారి పడుతుందా? అన్న విమర్శలు వస్తున్నాయి. అయితే గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కుల గణనకు జగన్ సర్కార్ ముందుకు రావడం విశేషమే.