Bengaluru Sinking: దేశ ఐటీ రాజధాని వెనిస్ నగరాన్ని తలపిస్తోంది. ఐటీ కంపెనీల నుంచి మామూలు ఇళ్ళ దాకా నీటిలోనే నానుతున్నాయి. జాతీయ, రాష్ట్రీయ అని తేడా లేకుండా రహదారులన్నీ నామరూపాలు కోల్పోయాయి. మొన్నటికి మొన్న బెంగళూరులో వర్షం ధాటికి రోడ్లు ధ్వంసమై ట్రాఫిక్ నిలిచిపోతే ఓ డాక్టర్ పేషంట్ కి సర్జరీ చేసేందుకు పరుగున వెళ్లాడు. 45 నిమిషాల పాటు పరిగెత్తి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి చేరుకున్నాడు. సకాలంలో సర్జరీ చేయడం వల్ల పేషెంట్ కు ప్రాణాపాయం తప్పింది. ఇలాంటి ఘటనలు జరగడానికి వర్షాలే కారణమని చెప్పుకున్నా.. ఈ స్థాయిలో వరదలు ముంచెత్తడానికి అసలు కారణాలు బోలెడు. చెరువుల కబ్జా, నాలాల ఆక్రమణ, రాజకీయ నాయకుల భూ దోపిడి.. ఇలా చెప్పుకుంటూ పోవాలే గానీ.. ఒక పుస్తకమే రాయచ్చు. ప్రస్తుతం బెంగళూరు ని ముంచెత్తుతున్న వరదల కి కారణం ఏమిటో ప్రస్తుత బిజేపి ప్రభుత్వం ఒక శ్వేత పత్రం విడుదల చేయాల్సింది. కానీ అలాంటి పనేమీ చేయలేదు. కనీసం ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా అన్నా కారణాలను విశ్లేషించి ప్రజలకి అసలు నిజాలు చెప్పాల్సి ఉండాల్సింది.

బెంగళూరు వరదలకి సంబంధించి అసలు నిజాలు ఇవి
* ప్రస్తుతం తూర్పు బెంగళూరు ప్రాంతంలో వరద నీరు వల్ల ముంపునకు గురయిన ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయి. మరతనహళ్లి నుంచి హెచ్ ఎస్ ఆర్ లే అవుట్ వరకు వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయి. దీనిని ఈస్ట్రన్ బెంగళూరు అంటారు.
* బెంగళూరు నదీ పరీవాహక ప్రాంతాలని పరిశీలిస్తే రెండు నదీ పరీవాహక ప్రాంతాలుగా విభజించాల్సి ఉంటుంది. 1) కావేరీ నదీ పరివాహక ప్రాంతం. 2) పెన్నార్ నదీ పరీవాహక ప్రాంతం.
*చిన్న డ్రైనేజీ ప్రవాహాలు.
వృషభావతి, హెబ్బాల్, కోరమంగళ-చల్లఘట్ట, బెంగళూరు లో 1/4 వంతు అంటే పశ్చిమ,దక్షిణ పశ్చిమ,ఉత్తర పశ్చిమ ప్రాంతాలు వృషభావతి ప్రాంతం కిందకి వస్తాయి. ఈ ప్రాంతంలో కురిసే వర్షపు నీరు ముందు చిన్న చిన్న చెరువులలోకి వెళుతుంది. చెరువులు నిండిన తరువాత ఆ నీళ్ళు వృషభావతి నదిలోకి వెళతాయి. వృషభావతి నది ఆర్కావతి నదికి ఉపనది. ఆర్కావతి నది వెళ్ళి మెకేదాతు దగ్గర కావేరీ నదిలో కలుస్తుంది.
ఇక తూర్పు బెంగళూరు లోని మిగతా ప్రాంతం మొత్తం హెబ్బల్, కేసీ వ్యాలీ లో కురిసిన వర్షపు నీరు పెన్నార్ నదిలో కలుస్తాయి. పెన్నార్ తమిళనాడులోకి ప్రవహిస్తుంది.
బెంగళూరు తూర్పు ప్రాంతంలో చాలా చెరువులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కురిసే వర్షపు నీరు మొత్తం కూడా చేరువులలోకి వెళ్తుంది. చెరువులు నిండగానే వరద నీరు పినాకిని,దక్షిణ పెన్నార్ నదులలోకి వెళ్లిపోతాయి.
వర్షపు నీరు చేరువులలోకి వెళ్ళడానికి దారి తీసే చిన్న చిన్న ఛానెల్స్ దాదాపుగా చెత్త,ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండి పోయి ప్రవాహ వేగం తగ్గిపోయింది. కొన్ని చోట్ల వర్షపు నీరు ప్రవహించే ఛానెల్స్ ని ఆక్రమించి ఇళ్ళు,అపార్ట్మెంట్స్ కట్టేశారు. దాంతో చెరువులలోకి నీళ్ళు వెళ్ళే దారిలేక అవి ఎదురుతన్నుకొని తిరిగి రోడ్ల మీదకి,కాలనీలలోకి ప్రవహించాయి.
వర్షపు నీరు ప్రవహించే పిల్ల కాలువలు వెడల్పు కుచించుకుపోయాయి దాంతో బెల్లాన్దూర్, వర్టూర్ చెరువుల లోకి నీళ్ళు వెళ్లలేకపోయాయి.
* ఔటర్ రింగ్ రోడ్ అంటే మరతహల్లీ, బెల్లాన్దూర్ ల మధ్య ఉన్న స్ట్రెచ్ లో ఐటి హబ్, ఈ ప్రాంతంలో రోడ్లు, ఐటీ పార్క్ లు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కట్టారు కానీ ఈ ప్రాంతం అంతా వర్షపు నీరు ప్రవహించే ప్రాంతం ఒకప్పుడు. ఇప్పుడు మెట్రో కడుతున్నారు. మొత్తం ఈ ప్రాంతం అంతా వర్షపు నీరు వెళ్ళే ప్రాంతం కానీ ఇప్పుడు ఇవి అడ్డంగా ఉండడంతో ఐటి పార్క్ లోకి కూడా నీళ్ళు వచ్చేశాయి. మెట్రో పనుల వల్ల పెద్ద పెద్ద ఇసుక,రాళ్ళ గుట్టలు కూడా చుట్టూ పేరుకొని పోవడం మరో కారణం కానీ మెట్రో పనులు చాలా మందకొడిగా జరుగుతున్నాయి.
ఓ ఆర్ ఆర్ పరిధిలో మరతహల్లీ, బెల్లాన్దూర్ ప్రాంతంలో వరద నీరు ప్రవహించే ప్రాంతాలని వదిలిపెట్టి మిగతా ప్రాంతాలలో కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ మునిసిపల్ అధికారులతో పాటు,డెవలపర్స్,రాజకీయ నాయకులు ముడుపులు తీసుకొని అనుమతులు ఇచ్చేశారు.
ఇప్పుడు బెంగళూరు ఉత్తర,పశ్చిమ,దక్షిణ ప్రాంతాలలో వరద ఎందుకు లేదు ? కేవలం తూర్పు బెంగళూరు లోనే ఎందుకు వరద ముంపు ఉన్నది ? ఇది ఎవరూ ఆడగరు, ఎవరూ చెప్పరు.
బెంగళూరు ఉత్తర,పశ్చిమ,దక్షిణ ప్రాంతాలలో అభివృద్ధి జరిగింది ఐటి బూమ్ కి ముందు ! ఈ ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి అప్పటి మైసూరు మహారాజు ఆధ్వర్యం లో విశ్వేశరయ్య ప్లానింగ్ తో జరిగింది.
జయనగర్ కట్టేనాటికి విశ్వేశరయ్యకు జిపిఎస్, హెలీకాప్టర్ లతో పాటు ఎలాంటి ఆధునిక పరికరాలు లేవు. కేవలం గ్రామ కరణాలు,వాళ్ళ దగ్గర ఉన్న భూమి వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అప్పట్లో కేవలం ఇనుప గొలుసుల సహాయంతో సర్వే చేయించారు. జయనగర్ అతి పెద్ద, అత్యుత్తమ ప్లానింగ్ మొత్తం దక్షిణ ఆసియా లో అది కట్టే నాటికి ! ఇప్పటికీ అత్యుత్తమ ప్లానింగ్ కలిగిన ప్రాంతం ఇది.
బెంగళూరు ఈస్ట్ లో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతం బ్రిటీష్ హయాంలో ప్లాన్ చేసి కట్టారు. అది ఇప్పటికీ మంచి ప్లానింగ్ కలిగిన ప్రాంతం కూడా.
కంటోన్మెంట్ ప్రాంతం వదిలేస్తే మిగతా ప్రాంతం అంతా బెంగళూరు డెవలప్మెంట్ ఆధారిటీ ప్లానింగ్ తో అభివృద్ధి చేశారు. అయినప్పటికీ అప్పట్లో కూడా లంచాలు ఇవ్వడం ఉండేది. తీసుకోవడం కూడా ఉండేది. కానీ అవి ప్లాట్ లు కేటాయించినందుకు మాత్రమే ఇచ్చేవారు, తీసుకునేవారు. కానీ ఇప్పటిలా అనుమతి లేని ప్రాంతాలకి అనుమతులు ఇచ్చి భారీ మొత్తాలలో తీసుకోవడం లేదు. అనుమతులు ఇవ్వడానికి వీలు ఉన్న ప్రాంతాలలోనే అనుమతులు ఇచ్చారు తప్పితే ఎకో సిస్టమ్ ని దెబ్బతీసే విధంగా అనుమతులు ఇవ్వలేదు.
మరతహల్లీ నుంచి సిల్క్ రోడ్ వరకు ప్రాంతం మొత్తం 90 వ దశకంలో చిన్న చిన్న గ్రామాలు ఉండేవి అప్పట్లో. ఐటీ బూమ్ ప్రారంభం అయ్యాక విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడంతో వర్షపు నీరు ప్రవహించే ప్రాంతాలని కూడా రోడ్లు,భవనాలు కట్టడానికి కారణం అయ్యింది. అయితే అవినీతి అధికారులు,రాజకీయ నాయకులు చెప్తున్నది ఏమిటంటే కేవలం రెవెన్యూ మ్యాపులలో మాత్రమే చెరువులు,కాలువలు ఉన్నాయి తప్పితే అనుమతులు ఇచ్చేనాటికి అవి ఎండిపోయి ఆనవాళ్ళు కూడా లేకుండా ఉన్నాయి అని. కానీ ఆ ప్రాంతంలో కట్టడాలకి అనుమతి ఇవ్వకూడనే కదా చట్టం చెపుతున్నది ?
మాన్యత టెక్ పార్క్ లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. చాలా టెక్ పార్క్ లు వరద నీరు పరీవాహక ప్రాంతాలలో కట్టారు. కానీ ఈ రోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అనుకోలేదు కానీ దేని కోసమయితే అనుమతులు రద్దు చేశారో వాటిని అలానే వదిలేసి మిగతా ప్రాంతాలలో కట్టి ఉంటే ఇప్పుడున్న పరిస్థితి వచ్చి ఉండేది కాదు.

బెల్లందూర్ ప్రాంతంలో 24 గంటలలోనే 200 మి.మి వర్షం కురిసింది. ఈ ప్రాంతంలో కాలువల ఆక్రమణలు జరగకపోయినా సరే వరద నీరు ముంచెత్తుతుంది. క్లౌడ్ బర్స్ట్ అంటే ఇదే ! ఇలాంటి సందర్భాలలో ఎవరూ ఏమీ చేయలేరు.
అనుమతులు లేకపోయినా సరే కట్టిన కట్టడాలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అధికారులు,రాజకీయ నాయకులు కుమ్ముక్కు అయి ఇళ్ళు,అపార్ట్మెంట్స్ కట్టుకొనిచ్చారు. వీళ్ళ భరోసా ఏమిటంటే ఎంతో కొంత డబ్బు కడితే రెగ్యులర్ చేస్తారు అనే ఆశ. కానీ ఇప్పుడు వీటిని తప్పినిసరిగా కూల్చేయాలనే డిమాండ్ పెరిగిపోతున్నది. కానీ వోట్లు పడవనే భయం పాలకులది.
జాతీయ మీడియా అటు చెన్నై లో వరదలు వచ్చినప్పుడు.. కానీ ఇప్పుడు బెంగళూరులో వరదలు వచ్చినప్పుడు కూడా అదేదో ప్రళయం వచ్చినట్లు పదే పదే కధనాలు ప్రసారం చేయడం దేనికి ? ఐటి ఇండస్ట్రీ ని దెబ్బ తీయడానికా ? మరి ఢిల్లీ కాలుష్యం కి కారణం అవుతున్న పంజాబ్, హర్యానా రైతులు రోడ్ల మీద, పొలాలలో కాలుస్తున్న ఎండు గడ్డి మీద ఎందుకు కథనాలు ప్రసారం చెయ్యవు ? ఢిల్లీ లో యమునా నది కాలుష్యం మీద ఎందుకు కథనాలు ప్రసారం చెయ్యవు ? గత రెండు, మూడు రోజులుగా పడుతున్న వర్షాలు ఒక్క బెంగళూరు లోనే పడుతున్నాయా ? మొత్తం దక్షిణ కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కావేరీ పరీవాహక ప్రాంతాలలోనే కాదు దాని ఉప నదులు అయిన ఆర్కావతి,శింసా నదుల పరీవాహక ప్రాంతాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఈ నదులు ఎండిపోయి ఉన్నాయి.
తమిళనాడులోని మెట్టూరు డ్యాం లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఇక రామ నగర, చెన్నపట్టణ,తుముకూరు, చిక్క బళ్లాపూర్ జిల్లాలలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. బెంగళూరు కంటే ఈ ప్రాంతాలు చాలా తీవ్రంగా నష్టపోయాయి. కానీ జాతీయ మీడియా ఇవేవీ చూపకుండా కేవలం ఐటి పార్క్ లలోకి వచ్చి చేరిన వరదనీరుని పదే పదే చూపించడంలో మర్మం ఏమిటీ ?మొదట అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ హయాంలో మొదలయిన ఐటి బూమ్ లో అప్పటి కాంగ్రెస్ నాయకుల అవినీతి నేటి దుస్థితికి ప్రధాన కారణమనే ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన అవినీతి సొమ్ము నేరుగా ఢిల్లీ చేరుకునేది అప్పట్లో. ఒక సారి నిషేధిత ప్రాంతాలలో నిషేధం ఎత్తివేసి అవినీతికి గేట్లు ఎత్తిన తరువాత ఆపేదెవరు ? డీకే శివకుమార్ ఛాలెంజ్ చేస్తుంటే కర్ణాటక బిజేపి నాయకులు ఈ విషయాలను బయటపెట్టకపోవడం గమనార్హం.
చివరిగా ….
బీబీఎంపీ అధికారులు వర్షపు నీరు పోవడానికి గాను కొత్తగా తవ్విన కాలువలలో.. నగర ప్రజలు రాత్రి పూట ఇంట్లోని చెత్తని, ప్లాస్టిక్ వ్యర్ధాలని కాలువలో పడేయడం సాధారణం అయిపోయింది. ఈ వ్యర్ధాలతో కొత్తగా తవ్విన పిల్ల కాలువలు మూసుకుపోయి వర్షనీరు పోకుండా ఆపుతున్నది. దీనికి బాధ్యులు ఎవరు ? వరద నీరు ఇళ్లలోకి రాగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎంతవరకు సబబు ?
”తిలా పాపం తలా పిడికెడు ”