Karnataka : ఏదేదో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి.. ఓ సినిమాలో బాలయ్య డైలాగ్ ఇది.. దీనిని కొద్దిగా మార్చి కర్ణాటక ఓటర్లకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలకు ముందు ‘ఎన్నెన్నో చెబుతాం.. అన్నీ నెరవేరుస్తామా ఏంటి’ అన్నట్లు ఆ పార్టీ వ్యవహరిస్తోంది. అక్కడ కొత్త సర్కార్ కొలువుదీరి వారం రోజులు కూడా కకముందే పాలక పక్షం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోనే కారణం. ఐదు ప్రధాన హామీలు నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ కూడా అధికార పార్టీకి అల్టిమేటం జారీ చేసింది. తాజాగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ తమ్ముడు డీకే. సురేశ్ మరోషాక్ ఇచ్చాడు. ఎన్నికల వేళ ఓటర్లకు పంచిన ఓచర్లు పనిచేయకుండా చేశాడు.
ఐదు హామీలతో అధికారంలోకి..
ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి ప్రధానంగా ఐదు హామీలు దోహదపడ్డాయి. అయితే ఇప్పుడా హామీలే కాంగ్రెస్ కు ఇరకాటంగా మారాయి. ఏ రాష్ట్రంలో అయినా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఓ సంవత్సరం వరకు సాఫీగానే ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా నూతన ప్రభుత్వం పట్ల కొన్ని నెలల పాటు ఓపిక వహిస్తాయి. ప్రభుత్వం ఏదైనా తప్పు చేసే వరకు వేచి చూస్తాయి. కానీ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిచిన ఆనందాన్ని ఆస్వాదించే పరిస్థితే లేకుండా పోయింది. ప్రజలే మెడ మీద కత్తిపెట్టినట్టే ఐదు హామీల అమలుపై చాలా చోట్ల నిలదీస్తున్నారు.
ఉచిత హామీలు ఇవీ..
– రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంటుతోపాటు మహిళలకు నెలకు రూ.2 వేలు, బీపీఎల్ కుటుంబానికి ఉచితంగా పది కిలోల బియ్యం, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలు కీలకమైనవి. మత్స్యకారులకు ఉచితంగా 500 లీటర్ల డీజిల్ వంటివి వీటికి అదనం. ఇలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రభుత్వానికి ఏటా రూ.62 వేల కోట్ల ఖర్చవుతుందని ఎకనామిక్ టైమ్స్ అంచనా వేసింది.
కరెంటు బిల్ల కట్టం.. టికెట్ తీసుకోం..
ఐదు హామీల్లో ఒకటి ఉచిత కరెంటు.. రెండోది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఈ రెండు తక్షణం అములు చేయాలని కర్ణాటక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కరెంటు బిల్లు వసూలుకు వచ్చిన అధికారులపై ప్రజలు తిరగబడుతున్నారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకోబోమని మహిళలు మొండికేస్తున్నారు. దీంతో అధికారులు తలలు పట్టుకుటున్నారు.
ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు..
కర్ణాటకలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో ఐదు హామీలు ఎంత కీలకంగా పనిచేశాయో.. కేపీసీసీ చీఫ్ డీకే.శివకుమార్ తమ్ముడు డీకే.సురేశ్ చేసిన పని కూడా అంతకంటే ఎక్కువ పనిచేసింది. కాంగ్రెస్కు ఓట్లు వేసేందుకు ఏటీఎం కార్డుల తరహాలో ఓచర్లు పంపిణీ చేశారు. ఆ ఓచర్లలో రూ.5 వేల బ్యాలెన్స్ ఉంటుందని, వాటిని ఉపయోగించి షాపింగ్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే ఓటింగ్ అయిపోయాకే పనిచేస్తాయని తెలిపారు. దీంతో ఓటర్లు గంపగుత్తాగా కాంగ్రెస్కు ఓట్లు గుద్దారారు. ఏరు దాటాక తెప్ప తగిలేసిన చందంగా ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఆ వోచర్లు చెల్లకుండా చేశాడు సురేశ్.
నియోజవర్గానికి 60 వేలు..
ఇలాంటి రూ.5 వేల బ్యాలెన్స్ ఉన్న ఓచర్లతో డీకే.సురేశ్ ప్రతీ నియోజకవర్గంలో పంపిణీ చేసినట్ల ప్రచారం జరుగుతోంది. ఒక్కో నియోజకవర్గానికి 60 వేల వరకు ఓచర్ల పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఓచర్లు పట్టుకుని షాప్లకు వెళ్తున ప్రజలు.. సామగ్రి కొనుగోలు చేసి ఓచర్ చూపించగానే షాప్ల యజమానులు అవి చెల్లవని చెబుతుండడంతో షాక్ అవుతున్నారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఓచర్ల పంపిణీ కేపీసీసీ చీఫ్ డీకే.శివకుమార్ చేయించారా.. లేక కాంగ్రెస్ అధిష్టానమే పంపించిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మోసపోవడం కర్ణాటక ఓటర్ల వంతైంది.