Free Electricity: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంచిన ప్రభుత్వం మార్చి నుంచి మరో రెండు హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు లబ్ధిదారుల వివరాలను సేకరిస్తోంది. ఇక గృహజ్యోతి పథకంపై తాజా అప్డేట్ ప్రకటించింది. అర్హులందరికీ ఉచిత విద్యుత్ అందాలనే ఉద్దేశంతో ఆధార్ కార్డు లేనివారికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది.
ఎలా అంటే..
అయితే గృహజ్యోతి వివరాల్లో చాలా మంది తమ ఆధార్ నంబర్ లేదని చెబుతున్నారు. అభయహస్తం దరఖాస్తుల్లో కూడా ఆధార్ నంబర్ పేర్కొనలేదు. దీంతో గృహజ్యోతి కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందులో ఆధార్ లేనివారు త్వరగా ఆధార్కు దరఖాస్తు చేసుకుని దానికి సంబంధించిన వివరాలు అందించాలని సూచించింది. ఆ వివరాలను విద్యుత్ మీటర్లో లింక్ చేస్తారని పేర్కొంది. ఆధార్ ఉన్నట్లు రుజువు చూపితే సరిపోతుందని తెలిపింది.
ఇక ఆధార్ రానివారు..
ఇక ఆధార్ రానివారు, బ్యాంకు, పోస్టాఫీస్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్ కార్డు కిసాన్ పాస్బుక్ ఇచ్చి పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించింది. ఆ వివరాలతో విద్యుత్ మీటర్ లింక్ చేసుకున్నవారికి మాత్రమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుందని స్పష్టం చేసింది.
వచ్చే నెల నుంచి అమలు..
ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లకు పెద్దె ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్నవారిలో ఎక్కువ మంది మహిళలే. ఈనెల లేదా వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే మీటర్ నంబర్తో ఆధార్ నంబర్ అనుసంధానం ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డు లేకపోయినా వివరాలు నమోదు చేసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సర్వీస్ నంబర్, ఆధార్ నంబర్, ప్రజాపాలన దరఖాస్తు రశీదు వివరాలు సేకరిస్తున్నారు.