Central Electricity Board: కరెంటు బిల్లుల మోత మోగనుంది.. ఇక నుంచి నెలనెలా బాదుడు తప్పదా అంటే అవుననే అంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. ఇంధనం ధరల మాదిరిగా విద్యుత్ చార్జీలు కూడా నెలనెలా మారుతాయన్న సంకేతాలు ఇస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే ఇంధనం చార్జీలు, విద్యుత్ కొనుగోలు ధరలు పెరిగినప్పుడు ఆ మేరకు భారాన్ని ప్రతినెలా ఆటోమేటిక్గా వినియోగదారుడిపై వేసేలా విద్యుత్తు కమిషన్ ఒక ఫార్ములా రూపొందించాలని కేంద్ర విద్యుత్తుశాఖ తాజాగా పేర్కొంది. ఈ మేరకు విద్యుత్తు నిబంధనలు–2005ని సవరిస్తూ కొత్త నిబంధనలు జారీచేసింది.

90 రోజుల్లో కొత్త ఫార్ములా..
విద్యుత్ తయారీకి ఉపయోగించే ఇంధన ధరల భారాన్ని ఇకపై విద్యుత్ సమస్థలు మోయవు. వినియోదారుడే వాటిని భరించాల్సి ఉంటుంది. ఈమేరకు కొత్త ఫార్ములాను రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. భారం నెలవారీగా ఆటోమేటిగ్గా వినియోగదారుల టారిఫ్కి మళ్లించేలా విద్యుత్తు కమిషన్ 90 రోజుల్లోపు ఒక ఫార్ములా రూపొందించాలని సూచించింది. నెలవారీ ట్రూఅప్ చార్జీలను వార్షిక ప్రాతిపదికన నిర్ధారించాలని స్పష్టం చేసింది. విద్యుత్ కమిషన్ ఈ కొత్త ఫార్ములా ఖరారు చేసే వరకూ ఈ నిబంధనల్లో చెప్పిన విధానాన్ని అనుసరించాలని స్పష్టంచేసింది.
– ఇంధనం, విద్యుత్తు కొనుగోలు సర్దుబాటు సర్చార్జి అంటే వినియోగదారులకు విద్యుత్తుసరఫరా చేయడానికి అయ్యేఖర్చు పెరగడమని అర్థం చేసుకోవాలి.
– ఈ అదనపు భారాన్ని లెక్కించి వినియోగదారుల బిల్లుల్లో కలపాలి. నియంత్రణ సంస్థ అనుమతుల ప్రక్రియ అవసరం లేకుండానే రాష్ట్ర కమిషన్ నిర్దేశించిన ఫార్ములా ప్రకారం ఆటోమేటిక్గా నెలవారీగా ఈ పనిచేయాలి.
– ఇంధనం, విద్యుత్తు కొనుగోళ్ల ఖర్చులు, అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీల్లో నెలవారీగా వచ్చిన వాస్తవ తేడా ఆధారంగా ఈ సర్చార్జిని లెక్కించాలి. ఉదాహరణకు ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి ఇంధనం, విద్యుత్తు కొనుగోళ్ల ఖర్చులో తేడా వస్తే ఆ భారాన్ని జూన్ నెల బిల్లులో కలపాలి.
– వినియోగదారులకు టారిఫ్ షాక్లు ఇవ్వకుండా డిస్కంలు ఎప్పటికప్పుడు ఇంధన, విద్యుత్తు కొనుగోళ్ల ఖర్చులను లెక్కించి ఆ తర్వాతి నెలలో వాటిని బిల్లుల్లో చేర్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు నెలలకు మించి జాప్యం జరగకూడదు.

– విద్యుత్తు నియంత్రణ కమిషన్ ముందుకు ఏదైనా వివాదం వస్తే దాన్ని 120 రోజుల్లోపు పరిష్కరించాలి. ఆ పరిమితిని స్పష్టమైన కారణాలతో మరో 30 రోజులు పొడిగించవచ్చు. ఏదైనా కారణంతో తుది ఉత్తర్వు వెలువరించలేని పరిస్థితి ఉంటే, ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా పేర్కొంటూ కమిషన్ కాలపరిమితి లోపు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలి. 120/150 రోజుల్లోపు తుది ఉత్తర్వులు వెలువడని పరిస్థితి ఉంటే ఉపశమనం కోసం బాధిత పక్షం అప్పిలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించడానికి ఈ కొత్త నిబంధన వీలు కల్పించింది.
ఇంధనం, బంగారం ధరల మాదిరిగా..
ప్రస్తుతం దేశంలో ఇంధనం, బంగారం ధరలు అనుసరిస్తున్న ఫార్ములానే ఇకపై విద్యుత్ వినియోగంలోనూ పాటించే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలపై 15 రోజులకు ఒకసారి సమీక్ష ఉంటుంది. ఇక బంగారం ధరలు రోజు రోజుకూ మారుతుంటాయి. బలియన్మార్కెట్ ఆధారంగా హెచ్చుతగ్గులు ఉంటాయి.. ఈ విధానంలోనే విద్యుత్ చార్జీల సవరణ ఇక నెలవారీగా జరుగనుంది. ముడి సరుకు, ఉత్పత్తి వ్యయం ఆధారంగా విద్యుత్ చార్జీల ధరలు మారనున్నాయి. ఆమేరకు భారం ఇకపై వినియోగదారుడే మోయాల్సి ఉంటుంది.