ఉగ్రవాద నిర్మూలన దినోత్సవం సందర్బంగా దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈరోజు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. ప్రపంచ మానవాళికి ఉగ్రవాదం శత్రువుగా మారిందని, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి ఇది పెద్దముప్పుగా పరిణమించిందని తెలిపారు. ఉగ్రవాదానికి సహకరిస్తున్న దేశాలను ఒంటరి చేయాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడం కోసం అన్నిదేశాలు ఏకతాటిపైకి రావాలని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న దేశాలను ఒంటరి చేసేందుకు అన్నిదేశాలు కలిసి పనిచేయాలని వెంకయ్యనాయుడు కోరారు.
భారత్ లో శాంతికి విఘాతం కలిగించే ఉగ్రమూకలను ఓడించేందుకు భద్రత బలగాలకు పౌరులందరూ అండగా నిలిచి తమ ఐకమత్యాన్ని చూపాలని చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా గురువారం ఉగ్రవాద నిర్మూలన దినోత్సవంగా పాటిస్తున్న సంగతి తెలిసిందే.