Telangana Elections 2023 : తెలంగాణలో తేలిన లెక్క.. రీపోలింగ్ పై ఈసీ స్పష్టత

రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడులో అత్యధికంగా 91.5%, యాకుత్ పురాలో 39.6% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.

Written By: NARESH, Updated On : December 1, 2023 9:52 pm
Follow us on

Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరో 36 గంటల్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇంతలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. అయితే గెలుపు పై అన్ని రాజకీయ పార్టీలు ధీమాతో ఉన్నాయి. కానీ 2018 ఎన్నికల కంటే పోలింగ్ శాతం తగ్గడం అన్ని పార్టీల్లో కలవరపాటుకు కారణమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఓ టర్ నాడి స్పష్టం చేసినా.. తుది ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే పోలింగ్ గణాంకాలను ఈసీ వెల్లడించడంతో లెక్కలు వేసే పనిలో రాజకీయ పక్షాలు పడ్డాయి.

రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 70.74% పోలింగ్ నమోదయింది. అయితే 2018 తో పోల్చుకుంటే మూడు శాతం తక్కువే. మరోవైపు పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఓట్లు ఎక్కువగా నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజు తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో 1,80,000 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడులో అత్యధికంగా 91.5%, యాకుత్ పురాలో 39.6% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. అయితే క్యూలో ఉన్న ఓటర్లను చూసి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు కొన్నిచోట్ల అవకాశం ఇచ్చినట్లు వికాస్ రాజ్ ప్రకటించారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తామని.. ఎనిమిదిన్నర గంటల నుంచి ఈవీఎంలలో లెక్కింపు ప్రారంభిస్తామని వివరించారు. అయితే ఈసారి కొత్తగా ఓటర్లుగా చేరిన యువత 3.6% ఉన్నారని.. వారంతా ఓటు వేశారని.. వయోవృద్ధుల సైతం ఓట్ ఫ్రమ్ హోమ్ ను వినియోగించుకున్నారని వివరించారు. రాష్ట్రంలో రీపోలింగ్కు ఎటువంటి అవకాశం లేదని తేల్చి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.3%, హైదరాబాదులో అత్యల్పంగా 46.56% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వివరించారు. అయితే ఈసీ వెల్లడించిన ఈ లెక్కలతో.. అన్ని పార్టీలు తమ లెక్కలు సరి చూసుకుంటున్నాయి.