తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి కనీస సర్వీసును ప్రభుత్వం రెండేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదివరకు పదోన్నతులకు మూడేళ్ల పరిమితి ఉండడంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగ సంఘాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయం శిరోధార్యమని చెబుతున్నారు. ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2020-21 ప్యానల్ సంవత్సరానికి ప్రమోషన్లకు కనీస సర్వీసును రెండేళ్లకు కుదిస్తూ ప్రభుత్వం జనవరిలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
సర్వీసు తగ్గింపు మిగతా సంవత్సరాలకు కూడా వర్తింపజేయాలని ఉద్యోగులు కోరుతున్నారు లేకపోతే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఉద్యోగ సంఘాలు విన్నవిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులందరికి లబ్ధి చేకూరేలా ప్యానల్ సంవత్సరాలకు సంబంధం లేకుండా ఉద్యోగుల పదోన్నతి కనీస సర్వీసు రెండేళ్లకు తగ్గించాలని సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. డీపీసీ నిర్వహించే సమయానికి రెండేళ్ల కనీస సర్వీసు ఉంటే పదోన్నతులకు అర్హులన్న ప్రభుత్వం ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి తీసుకొస్తామని చెప్పింది.
తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం బీఆర్కే భవన్ లో సీఎస్ సోమేశ్ కుమార్ ను కలిశారు. రెవెన్యూ శాఖలో వివిధ కేడర్ల పదోన్నతులు పెండింగులో ఉన్నాయన్నారు. సెప్టెంబర్ లో పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేసి నూతన జోనల్ విధానం ప్రకారం బదిలీలు చేపడతామని ట్రెసా ప్రతినిధులకు ప్రభుత్వ ప్రథాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారు.