కరోనా మహమ్మారి సమయంలో రైతులు తమ ఉత్పత్తుల అమ్మకం పట్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు భరోసా ఇచ్చారు. ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం పౌరసరఫరాల సంస్థకు మార్కెఫెట్ కు ప్రభుత్వం సుమారు రూ 30,000 కోట్ల మేరకు విడుదల చేసినదాని చెబుతూ ఇంత భారీ మొత్తాన్ని రైతుల కోసం ఉమ్మడి ఏపీలో కూడా ఎన్నడూ కేటాయించలేదని చెప్పారు.
మొక్కజొన్నకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదని చెబుతూ అయినా కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు. అందుకోసం రూ.3,200 కోట్లు మార్క్ఫెడ్కు మంజూరు చేశామని చెబుతూ మొక్కజొన్న ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చెప్పారు.
ఈ ఏడు 40 లక్షల ఎకరాల్లో వరి పంట, 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సిద్ధంగా ఉందని చెబుతూ రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందర పడకూడదని కోరారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పంట పండుతుంది కాబట్టి క్రమబద్ధతిలో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ప్రభుత్వం కూపన్లు ఇచ్చి , వాటి ప్రకారమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.
కూపన్ల పంపిణీలో వ్యవసాయ అధికారులది ప్రధాన పాత్ర అని చెబుతూ ఇప్పటికే సమీక్ష జరిపి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. కూపన్లలో ఉన్న తేదీల ప్రకారమే విక్రయాలు జరుగుతాయని స్పష్టం చేశారు.
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు అందుకోసం రూ 25,000 కోట్లు సమకూర్చామని చెబుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఏర్పాట్లు లేవని గుర్తు చేశారు. నెలా 15 రోజుల పాటు ధాన్యం కొనుగోలు చేస్తామని, డబ్బులన్ని ఆన్లైన్లో బదిలీ చేస్తామని వివరిస్తూ రైతులు సహకరించాలని కోరారు.
ఊరి ధాన్యం ఎలా పోవాలనేది సమీక్షల ద్వారా చర్చించుకోవాలని చెబుతూ బిహార్ నుంచి హమాలీలను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అనవసరంగా కొనుగోలు కేంద్రం వద్దకు రావద్దని హితవు చెప్పారు. పంట కోయడానికి రైతులు హార్వెస్టర్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
కరోనా దిగ్బంధనం సమయంలో గ్రామాలకు ముళ్ల కంచెలు వేయడం మంచిదే కానీ, ఎవరినీ రానీయమంటే మంచిది కాదని హితవు చెప్పారు. రేషన్ బియ్యం లారీలను అడ్డుకోకూడదని సీఎం కేసీఆర్ సూచించారు.