Rowdy sheeter on screen in Teenmaar Mallanna case? : సోషల్ మీడియా ఉద్యమకారుడు, ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కేసులో అనుకోని ట్విస్ట్ నెలకొంది. ఇప్పటికే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. హైదరాబాద్ చిలకలగూడలో పోలీసులు మల్లన్నను గతంలో అరెస్ట్ చేశారు.. లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడి నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో ఈ కేసు నమోదైంది.
యూట్యూబ్ లో తీన్మార్ మల్లన్న(Teenmaar Mallanna) ప్రస్తుతం ‘క్యూ’ న్యూస్ చానెల్ ను నిర్వహిస్తున్నాడు. అందులో కొద్దిరోజుల పాటు లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడిపై వరుస కథనాలు ప్రసారం చేశారు. జ్యోతిష్యం పేరుతో లక్ష్మీకాంత శర్మ చాలా మందిని మోసం చేశారని అందులో ఆరోపించారు. బాధితులుగా చెబుతున్న కొంతమందితో చానెల్ లో మాట్లాడించారు.
ఇదే క్రమంలో లక్ష్మీకాంత వర్మ ఇటీవల మల్లన్నపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లన్న తన నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేశారని.. కొందరు నకిలీ భక్తులను తన వద్దకు పంపి ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చేందుకు తాను నిరాకరించడంతో ఇలా తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేశాడని జ్యోతిష్యుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులు తాజాగా మాజీ రౌడీషీటర్ అంబర్ పేట శంకర్ ను విచారించినట్టు సమాచారం. శంకర్ ను పిలిచిన పోలీసులు అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నట్టు తెలిసింది.
జ్యోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ-తీన్మార్ మల్లన్న వివాదంలో 30 లక్షల డబ్బు చెల్లింపు విషయంలో తనకు శర్మకు మధ్య సెటిల్ మెంట్ చేయడానికి రౌడీషీటర్ అంబర్ పేట శంకర్ ప్రయత్నించాడని మల్లన్న బయటపెట్టాడు. దీంతో ఆదివారం శంకర్ ను పిలిచిన పోలీసులు అతడిని విచారించారు. శర్మ కోరిన మీదటే ఇద్దరి మధ్య రాజీ చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే అని.. అయితే తాను అందులో విఫలమయ్యానని శంకర్ పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు రౌడీ షీటర్ శంకర్ వద్ద చిలకల గూడ అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.