తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అయితే.. మొదట్నుంచీ తమకు 5 లక్షల మెజారిటీ వస్తుందని చెబుతోంది వైసీపీ. టీడీపీ మాత్రం.. కుదిరితే గెలవాలని, లేదంటే.. రెండో స్థానాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం ముందు నుంచీ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో.. పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.
అయితే.. ఈ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేయించారని టీడీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి బస్సుల ద్వారా జనాన్ని తరలించి, దొంగ ఓట్లు వేయించారని ఆ పార్టీ నేతలు అన్నారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. ఇందులో తిరుపతి ప్రాంతంలో మాత్రమే దొంగ ఓట్ల ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలపై వైసీపీ కౌంటర్ ఇచ్చింది. లోపల పోలింగ్ ఏజెంట్లు ఉన్న తర్వాత దొంగ ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించింది. మొత్తానికి.. ఈ విమర్శల నడుమ ఓటింగ్ ముగిసింది. అయితే.. పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత పసుపు దళం డీలా పడిపోయినట్టు తెలుస్తోంది. వాళ్లు ఆశించిన విధంగా జరగలేదని భావిస్తున్నట్టు సమాచారం.
2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దుర్గాప్రసాద్ కు 7,22,877 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 4,94,501 ఓట్లు వచ్చాయి. దీంతో.. ఈ సారి గెలవకపోయినా, ఓట్లు మాత్రం తగ్గొద్దని టీడీపీ నిర్ణయించుకుంది. దీనికోసం చంద్రబాబు భారీగా ప్రచారం చేశారు. అయితే.. అచ్చెన్నాయుడి వ్యాఖ్యల వివాదంతో పార్టీ పుట్టి మునిగిందనే అభిప్రాయం కూడా వెల్లడైంది. దీంతో.. ఈ సారి గతంలో వచ్చినన్ని ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో సెకండ్ ప్లేస్ ఎవరిది? అనే చర్చ జరుగుతోంది. రెండో స్థానంలో టీడీపీ నిలబడుతుందా? లేదంటే.. బీజేపీ ఆ ప్లేసును ఆక్రమించుకుంటుందా? అనే చర్చ సాగుతోంది. మరి, ఏం జరుగుతుందన్నది మే 2న తెలియనుంది.