
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీని నడిపించడంలో సారథి చంద్రబాబు విఫలం అవుతున్నట్లుగా క్యాడర్కు సైతం అర్థమైపోయింది. అందుకే.. ఇప్పుడు టీడీపీకి సారథి మారాల్సిన ఆవశ్యకత ఏర్పడినట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఒకప్పటి జవసత్వాలు రావాలంటే ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత అధినేత చంద్రబాబు, తనయుడు లోకేష్ నిర్ణయాలు చూసిన కేడర్ ఇక జూనియర్ మాత్రమే పార్టీని కాపాడగలరన్న నిర్ణయానికి వచ్చారు..?
చంద్రబాబు బ్యాడ్ టైం ఒకరకంగా 2018 నుంచి ప్రారంభమైంది. వైసీపీ ప్యూహంలో చిక్కుకుని బీజేపీ బంధాన్ని తెంచేసుకున్నపుడే చంద్రబాబు రాజకీయ వ్యూహం ఎంత పేలవంగా ఉందో అర్థమైందని చర్చించుకుంటున్నారు టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఆ తర్వాత వరస తప్పులు చేస్తూ ఏపీలో టీడీపీని చాపచుట్టేసే స్థితికి చంద్రబాబు తెచ్చారని అంటున్నారు. పరిషత్ ఎన్నికలు బహిష్కరించామని గొప్పగా చెప్పుకుంటున్నా చంద్రబాబు భజన బ్యాచ్ ఈ నిర్ణయం వల్ల లాభపడింది ఎవరన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. టీడీపీ ఎన్నికల్లో పాల్గొనకపోతే లాభం చేకూరేది రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీ జనసేన కూటమికే అని రాజకీయ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు.
చంద్రబాబు తాను ఎన్నికల రేసులో లేను.. ఓట్లేయవద్దు అనడం ద్వారా అసలుకే ఎసరు తెచ్చిపెట్టింది. టీడీపీ క్యాడర్ మాత్రం నేతల దగ్గర తమ గోడు వెళ్లబోసుకుంటోంది. ఏడాది కాలంగా ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతో డబ్బు ఖర్చుపెట్టుకున్నామని, అప్పులు చేసి మరీ నోట్లు పంచామని.. ఇప్పుడు తమ పరిస్థితేంటని లబోదిబోమంటున్నారు. వారి దుస్థితి చూడలేక కొందరు సీనియర్ నేతలు గళం సవరించారు. ఇప్పటివరకు కింది స్థాయి క్యాడర్ వల్లే నడుస్తూ వస్తున్న టీడీపీ.. ఇప్పుడు ఆ క్యాడర్ను కోల్పోయే పరిస్థితిని తెచ్చుకుంది. ఇక టీడీపీ పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్న నాయకులు జనసేన వైపు చూస్తున్నట్లుగా సమాచారం.
మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటింది. ఇప్పుడు టీడీపీ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. అసలు పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయంపైనా రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. చంద్రబాబు నిర్ణయాన్ని సమావేశంలో అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్యచౌదరి, యనమల రామకృష్ణుడు, కూన రవికుమార్ లాంటి వారు విభేదించినట్లు తెలుస్తుంది. బాబు తీసుకున్న నిర్ణయంతో లోకేష్ కూడా విభేదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైన మేల్కొని పార్టీ పుట్టి పూర్తిగా మునగక ముందే పార్టీ ఎన్టీఆర్ చేతిలో పెట్టడం బెటరని కొందరు సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారట.