Chandrababu- Assembly
Chandrababu- Assembly: తనకు అన్యాయం జరిగిందని, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ, ఇలాంటి సభలో నేను ఉండను అంటూ దుమ్మెత్తిపోసి, వస్తే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతాన్న చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయి సరిగ్గా ఏడాది. ఆ తరువాత ఆయన పట్టువీడి శాసనసభకు ఈ రోజు వచ్చారు. చాలా కాలం తరువాత ఆయన వస్తుండటంతో ఆహ్వానం పలికేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలందరు ఆయన నివాసానికి చేరుకున్నారు. టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఆసక్తికరంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల అనంతరం గురువారం ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక జరుగుతుంది. ఏకగ్రీవమనుకుంటున్న తరుణంలో చంద్రబాబు టీడీపీ తరుపున అభ్యర్థిని నిలబెట్టి కొత్త సమరానికి తెరలేపారు. తన అనుయాయులను గెలిపించుకునేందుకు శపథాన్ని ప్రక్కనబెట్టి మరీ అసెంబ్లీకి రావడం ఆసక్తికరంగా మారింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తన ఓటును వినియోగించుకున్నారు. చంద్రబాబు కూడా ఓటు వేశారు.
ఒక్క ఓటు కోసం
ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. వైసీపీ ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది. వీరందరూ నామినేషన్లు దాఖలు చేయగా, అన్నీ ఓకే అయ్యాయి. ఎన్నిక ఏకగ్రీవమని అనుకుంటున్న తరుణంలో, చంద్రబాబు చివరి క్షణంలో పంచుమర్తి అనురాధను ప్రకటించి నామినేషన్ దాఖలు చేయించారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్కరికి 22 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తే సరిపోతుంది. ఆ మేరకు వైసీపీకి 154 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీడీపీకి 21 ఓట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కొంతమంది అభ్యర్థులు ఇరు పార్టీల్లోనూ రెబెల్ గా ఉన్నారు. వారి మద్దతును కూడా ఆయా పార్టీలు తీసుకోనున్నాయి. ఆ ఒక్క ఓటు కోసం టీడీపీ సాయంత్రం వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. ఇరు పార్టీల్లోనూ విప్ జారీ చేసి ఉండటంతో గెలుపు రసకందాయంలో పడింది.
Chandrababu- Assembly
ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం
అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు దూరంగా ఉన్నా, సభలో అనుసరించాల్సిన వ్యూహ ప్రతి వ్యూహాలపై చంద్రబాబు ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు. అధికార పార్టీని ఇరుకున పెట్టేందకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వ్యూహాలు రచిస్తున్నారు. చివరి వరకు వేచి చూసి అధికార పార్టీకి టెన్షన్ పెట్టించడమే అవుతుంది. ద్వితీయ ప్రాధాన్యత ఓటు అనే అంశాన్ని ఎమ్మెల్యేల్లోకి తీసుకెళ్లడం కూడా మరో ఎత్తుగడ.