YCP MLAs
YCP MLAs: మన ఇంట్లో ఉన్నవి మూడు ఓట్లు. కానీ నాకు పడింది రెండే ఓట్లు. మీలో ఎవరు వేయలేదు చెప్పండి అంటూ కోటా శ్రీనివాసరావు భార్య వై. విజయ, కుమారుడు శివాజీ రాజాను ఏడుస్తూ అడుగుతున్న సినిమా క్లిప్ ఒకటి ఇప్పడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల క్రాష్ ఓటింగ్ తో జగన్ పరిస్థితి ఇది అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. దీంతో వైసీపీలో కూడా ఒకరకమైన అంతర్మథనం ప్రారంభమైంది. ఇంత బలం ఉండి, బలగం ఉండి కూడా తప్పు జరిగిందని ఆ పార్టీ నేతల బాధ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకూ గెలుపు తప్ప ఓటమి రుచి చూడని వారు.. వరుసగా ఎదురవుతున్న పరాభావాలతో నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నారు. తమకు సాంకేతికంగా ఉన్న 23 ఓట్ల వరకే టార్గెట్ పెట్టుకోవడంతో ఆ మేరకు క్రాస్ ఓటింగ్ జరిగిందని లేకపోతే ఇంకా చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలు పంపారు. ఇది మైండ్ గేమ్ కోసం చేసిన ప్రకటనో కాదో కానీ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ఆ పార్టీలో ఓ రకమైన అనుమాన పరిస్థితి నెలకొంది. ఏ ఒక్క ఎమ్మెల్యేనూ నమ్మలేనట్లుగా పరిస్థితి మారింది.
ఎమ్మెల్యేల్లో అసంతృప్తి జ్వాల..
ఎమ్మెల్యేల కోటా కింద ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో కలిపి వైసీపీకి 156 మంది ఉన్నారు. అందులో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డిలను తీసేసినా ఇంకా 154 మంది ఉంటారు. ఏడుగురు వైసీపీ అభ్యర్థుల గెలుపునకు వీరు చాలు అన్నట్టు వైసీపీ హైకమాండ్ వ్యవహరించింది. అదే సమయంలో తమతో 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టు టీడీపీ ప్రకటించింది. అయితే దీనిని వైసీపీ లైట్ తీసుకుంది. కానీ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించడం, డిన్నర్ రాజకీయాలు నడిపింది. అంతటితో ఆగకుండా నిఘా వర్గాలకు పనిచెప్పింది. ఆ సమయంలో చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురయ్యారు. ఈ అనుమానం ఇంతటితో ఆగదని.. వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని చాలామంది భావించారు. అందులో ఇక పార్టీతో లాభం లేదనుకున్న నిర్ణయానికి వచ్చిన ఇద్దరు టీడీపీ వైపు మొగ్గుచూపారు.
ఆది నుంచి అనుమానాలే..
అనుమానం అన్నది వైసీపీ బ్లడ్ లోనే ఉంది. హైకమాండ్ తో విభేదించిన సొంత పార్టీ ఎంపీ రఘురామక్రిష్ణంరాజుతో సైతం మాట్లాడవద్దని ఎంపీలకు సూచించేదాక పరిస్థితి వచ్చింది. పార్టీలో అనుమానం అన్నది చాలా రోజులుగా ఉంది. అందుకే మీరు కాకపోతే మరో నాయకుడ్ని తయారుచేసుకుంటానంటూ అధినేత చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలను హెచ్చరించారు. అయితే ఇన్నాళ్లూ ఒక ఎత్తు.. ఇక్కడ నుంచి మరో ఎత్తు అని వైసీపీ సీనియర్లు భావిస్తున్నారు. టీడీపీ ట్రాప్లో పడి ఎమ్మెల్యేల్ని దూరం చేసుకుంటే మొదటికే మోసం వస్తుందని పలువురు సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
YCP MLAs
అలా సాగితే మొదటికే మోసం..
అయితే వైసీపీలో రేగిన అనుమానపు ముసలం ఆ పార్టీని దహించి వేసే చాన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. మొన్నటికి మొన్న తారకరత్న మరణం సమయంలో చంద్రబాబు పక్కన కూర్చున్నారన్న ఒకే ఒక కారణంతో విజయసాయిరెడ్డి వైపు వైసీపీ శ్రేణుల అనుమానపు చూపులు అన్నీ ఇన్నీకావు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ఓటు వేశారన్న కోణంలో దర్యాప్తు చేసే క్రమంలో ప్రతిఒక్కర్నీ అనుమానించే అవకాశముంది. అటు నిఘా వర్గాల కదలికలతో ఇప్పటికే ఒకరకమైన ఇబ్బందికర పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీలో అగ్రనేత ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కర్నీ బలి చేస్తారని ఇలాంటి పార్టీలో ఉండాలంటే… వారికి ఎంతో నమ్మకం కలిగించాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా అందర్నీ అనుమానించి .. అవమానపరిస్తే….. మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో అనుమాన ముసలం అయితే అంటుకుంది. అది ఎక్కడి వరకూ తీసుకెళుతుందో చెప్పలేం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Suspicious looks on mlas crisis in ycp party
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com