Telangana: తెలంగాణలో మరో సర్వే.. షాకింగ్‌ ఫలితాలు.. ఎవరికి ఎన్ని సీట్లంటే..

ఇక తెలంగాణలో కూడా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా లోక్‌సభ ఎన్నికలకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : February 19, 2024 4:05 pm
Follow us on

లోక్‌సభ ఎన్నికలకు మార్చి మొదటి వారంలో షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని రెండు రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వారం పది రోజుల్లో షెడ్యూల్‌ వస్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో అటు జాతీయ పార్టీలు ఇటు ప్రాంతీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి.

తెలంగాణలో కూడా..
ఇక తెలంగాణలో కూడా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా లోక్‌సభ ఎన్నికలకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈమేరకు ఇప్పటికే ఇన్‌చార్జీలను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, చేరికలపై దృష్టిపెట్టింది. ఇక బీజేపీ కూడా దూకుడు పెంచింది. ఫిబ్రవరి 20 నుంచి పార్లమెంటు నియోజకవర్గాల్లో రథయాత్రలు చేపడుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకోవాలని, పార్టీ పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఈమేరకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌ కూడా ఇటీవల నల్లగొండలో సభ నిర్వహించారు.

సర్వే సంస్థల హడావుడి..
ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల కోసం పలు సంస్థలు ప్రీపోల్‌ సర్వే నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే టైమ్స్‌ నౌ, ఇండియా టుడే సంస్థలు సర్వే నిర్వహించి ఫలితాలను వెల్లడించాయి. ఇంకా పలు సంస్థలు సర్వే చేస్తున్నాయి. మరోవైపు అన్ని పార్టీలు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నాయి. తాజాగా తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ మరో సర్వే చేయించింది. ఇప్పటికే ఒక సర్వే చేయగా షాకింగ్‌ ఫలితాలు వచ్చాయి. తాజాగా సర్వే ఫలితాలు ఆ పార్టీని మరింత షాక్‌కు గురిచేసినట్లు ప్రచారం జరుగుతోంది.

తాజా సర్వే ఫలితాలు ఇలా..
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 9 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, బీజేపీ 4, కాంగ్రెస్‌ 3 స్థానాల్లో గెలిచాయి. ఒక స్థానంలో ఎంఐఎం గెలిచింది. తాజాగా బీఆర్‌ఎస్‌ నిర్వహించిన సర్వే ఫలితాలు చూస్తే బీజేపీ 9, కాంగ్రెస్‌ 4 స్థానాల్లో గెలుస్తాయని ఫలితాలు వచ్చాయట. బీఆర్‌ఎస్‌ కేవలం 3 స్థానాలకు పరిమితమవుతుందని తెలుస్తోంది. ఎంఐఎం తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని బీఆర్‌ఎస్‌ సర్వే ఫలితాలు ఉన్నాయని సమాచారం. గతంలో గెలిచిన స్థానాలను నిలబెట్టుకోవాలని చూస్తున్న బీఆర్‌ఎస్‌ గతంలో నిర్వహించిన సర్వేలో 5 స్థానాలు వస్తే.. తాజా సర్వేలో మరో రెండు స్థానాలు తగ్గాయి. దీంతో ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి అన్న ఆందోళన గులాబీ నేతల్లో నెలకొందని తెలుస్తోంది.