Supreme Court verdict: భారత దేశంలో వెనుకబడిన కులాలు, వర్గాలను పేదరికం, డబ్బులు ఆశ చూపి మతం మార్చే సంస్కృతి దశాబ్దాలుగా కొనసాగుతోంది. మతం మారినా రిజర్వేషన్లు మారకుండా ఉండడంతో చాలా మంది దళితులు, గిరిజనులు మతం మారేందుకు మొగ్గు చూపారు. అయితే మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తింపచేయడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పు పట్టింది. మతం మారితే రిజర్వేషన్లు రద్దు చేయాలని తీర్పు చెప్పింది. దానిపై సుప్రీం కోర్టుకు వెళ్లగా అత్యున్నత న్యాయస్థానం కూడా ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది. మతం మారితే హక్కులు ఉండొద్దని స్పష్టం చేసింది.
తీర్పు నేపథ్యం..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. క్రై స్తవ మతంలో కుల వ్యవస్థ లేనందున, మతమార్పిడ తర్వాత ఎస్సీ హోదా ఆటోమేటిక్గా రద్దవుతుందని వివరించింది. రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ 1950 ప్రకారం ఇది మూల సూత్రమేనని ధర్మాసనం నొక్కి చెప్పింది.
Also Read: RAW ఇలా పుట్టింది.. ఇలా పెరిగింది.. మన గూఢచార లెజెండ్స్ వీరే
చట్టపరమైన ఆధారాలు
రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ గుర్తింపు మతపరమైన మార్పులతో ముగుస్తుంది. అట్రాసిటీ చట్టం (ఎస్సీ/ఎస్టీ యాక్ట్) కింద కేసులు నమోదు చేసుకోవడానికి కూడా ఎస్సీ సర్టిఫికెట్ చట్టబద్ధంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. మతం మారినవారు ఐపీసీ సెక్షన్ల కింద మాత్రమే చర్యలు తీసుకోవచ్చని, ప్రత్యేక రక్షణలు వర్తించవని తేల్చింది. హైకోర్టు న్యాయమూర్తి ఎన్.హరినాథ్ మునుపటి వ్యాఖ్యలను సమర్థిస్తూ ఈ తీర్పు వచ్చింది.
మునుపటి తీర్పులు ఇలా..
1985లో సుప్రీంకోర్టు చారిత్రక వివక్ష కొనసాగవచ్చని అంగీకరించినప్పటికీ, మతమార్పిడికి తగిన సాక్ష్యాలు లేకపోవడం వల్ల హక్కులు ఇవ్వలేమని పేర్కొంది. 2024 నవంబర్, 2025 మేలోనూ ఇలాంటి తీర్పులు వచ్చాయి, ఇప్పుడు మరింత ధ్రుఢత్వం చెందింది. రిజర్వేషన్ కోసం మత మార్పిడిని రాజ్యాంగ మోసంగా సర్వోన్నత న్యాయస్థానం పరిగణించింది.
ఈ నిర్ణయం దళిత క్రై స్తవుల ‘కులం మారదు‘ వాదనకు ముగింపు పలుకుతూ, రిజర్వేషన్ విధాన ఉద్దేశ్యాన్ని రక్షిస్తుంది. ఎస్సీ సర్టిఫికెట్ల జారీలో కఠిన పరిశీలనలు పెరిగి, తప్పుడు దావాలు తగ్గుతాయి. తెలంగాణ, ఆంధ్రల్లో దళిత జీవితాలపై ప్రభావం పడుతూ, మత స్వేచ్ఛ–న్యాయ సమతుల్యతను నొక్కి చెబుతుంది.
