రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. అవసరాలను బట్టి మారిపోయే రాజకీయ పార్టీల సిద్ధాంతాలకు, నేతల మాటలకు ఈ సూత్రం చక్కగా సరిపోతుంది. టీడీపీ కాంగ్రెస్ తో జోడి కడుతుందని ఎవరైనా అనుకున్నారా? ఎన్నడూ జరగదనుకున్న ఆ పరిణామం, బాబు గత ఎన్నికలలో సాకారం చేశారు. కాబట్టి రాజకీయాలలో ఏదైనా జరగొచ్చు, ఎవరు ఎవరికైనా మిత్రులు కావచ్చు. ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాలలో ఇలాంటి పరిస్థితే నెలకొంది . రెండు ప్రధాన పార్టీల అధినేతలైన చంద్రబాబు, పవన్ ప్రత్యర్థులను పొగిడేస్తున్నారు. చంద్రబాబు మోడీని భేష్ అంటుంటే, పవన్ జగన్ కి కితాబు ఇస్తున్నాడు. ఈ పరిణామం ఆంధ్ర రాజకీయాలలో సరికొత్త సమీకరణాలకు దారి తీస్తోందా అనే అనుమానం రేపుతోంది.
అమరావతి ఉద్యమం 200రోజులు పూర్తి చేసుకున్న సంధర్భంగా బాబు ఓ సుదీర్ఘ ప్రసంగం చేశారు. తన ప్రసంగం మొత్తం ఆంధ్రాలో జగన్ అరాచక పాలన చేస్తున్నాడు, జరుగుతున్న అరా కొరా సంక్షేమం మోడీ చలవే అన్నట్లు సాగింది. ఇకప్పుడు ‘భార్యను వదిలేసిన మోడీకి, బంధాల విలువ ఏమి తెలుస్తుందని’ దారుణమైన వ్యక్తిగత విమర్శలు చేసిన బాబు, ఏపీలో విధ్యుత్ ధరల గురించి ప్రశ్నించిన నిర్మలా సీతారామన్ ని వైసీపీ వాళ్ళు వ్యక్తి గత విమర్శలు చేశారని వాపోవడం ప్రజలకు వింతగా తోచింది. అమరావతి జాతీయ ప్రాజెక్ట్, సంపద చేకూర్చే కల్పతరువన్న బాబు, మోడీనే కాపాడాలని వేడుకున్నాడు. పరోక్షంగా మోడీ వలన ఆంధ్రాకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కొనియాడాడు. 2019 ఎన్నికల ముందు మోడీపై బాబు చేసిన వ్యాఖ్యలు గుర్తున్న ఎవరికైనా, ఆయన తాజా మాటలు ఆశ్చర్యం కలిగించక మానవు.
మరో వైపు జగన్ అంటే కస్సున లేచే పవన్ అంబులెన్సు సర్వీసుల పునరుద్ధరణ విషయంలో మెచ్చుకోవడం మరో సంచలన రాజకీయ పరిణామంగా మారింది. బీజేపీతో మిత్రుడిగా ఉన్న పవన్ సీఎం జగన్ ని మెచ్చుకోగా, ఆ ప్రాజెక్ట్ కి అవినీతి మరక అంటించడంతో పాటు, కేవలం ప్రచార ఆర్భాటం మాత్రమే అని బాబు కొట్టిపారేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బాబు బీజేపీ కి దగ్గరవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని అర్థం అవుతుంది. దానికి కారణం జగన్ దూకుడికి అడ్డుకట్ట వేయడం కోసమే. ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ నాయకుల వరుస అరెస్ట్ ల నేపథ్యంలో ఎంత త్వరగా బీజేపీ పంచన చేరితే అంత మంచిది అనేది ఆయన ఆలోచన. ఐతే పవన్ సీఎం జగన్ ని పొగడడం అనేది ఇక్కడ ఆసక్తి గొలిపే అంశం. బాబు మోడీని పొగడడం వెనుక కారణాలు, ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తుండగా, పవన్ కి జగన్ ని పొగడడం వలన చేకూరే ప్రయాజనం ఏమి లేదు. ఈనేపథ్యంలో జగన్ కి అనుకూలంగా పవన్ ఎందుకు స్పందించాడనే సందేహం తలెత్తుంది. అలాగే భవిష్యత్తులో కొత్త పొత్తులతో, నయా రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందనిపిస్తుంది.