Palamuru: ఆ కన్నీళ్ల వెనక ఎన్నో కష్టాలు.. పల్లేర్లు మొలిచిన పాలమూరు పచ్చబడుతోంది

సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులను గుర్తుచేసుకుంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, పాలమూరు జిల్లా వాసి నిరంజన్‌రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 20, 2023 5:53 pm

Palamuru

Follow us on

Palamuru: ఉమ్మడి పాలమూరు.. తెలంగాణలో మొన్నటి వరకు అత్యంత కరువు జిల్లా. వలస కార్మికులకు చిరునామా. ఇక తెలంగాణలో ఏ ఇతర ప్రాంతంలో చూసినా కూలీలు, తాపీ మేస్త్రీలు, గొర్రెల కాపరులు ఉన్నారంటే.. వారు పాలమూరు వారే అయి ఉండేవారు. అసలే వర్షపాతం తక్కువ. పక్కనే కృష్ణమ్మ పారుతున్నా… పంటలకు అందించుకోలేని దుస్థితి. ఆంధ్రా పాలకుల అలసత్వంతో పాలమూరు అత్యంత వెనుకబడిన జిల్లాగా నిలిచిపోయింది. సాగుభూములు ఏళ్లుగా బీళ్లుగా ఉండే పరిస్థితి నెలకొంది. బతుకు దెరువు కోసం పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లాల్సిన రోజుల తలుచుకుంటే.. ఇప్పుడు ప్రతీ పాలమూరువాసి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. పాలకులు మారుతున్నా.. పంటలకు నీళ్లు అందించలేని దుస్థితి దశాబ్దాలపాటు కొనసాగింది.

తెలంగాణతో మారిన పరిస్థితి..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పాలమూరు పరిస్థితి క్రమంగా మారుతోంది. వలసలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఇక కృష్ణా జలాలను బీళ్లకు మళ్లించే మహా యజ్ఞ ఫలించబోతోంది. ఇప్పటికే మొదటి దశ పూర్తయి ఇటీవలే ప్రారంభించారు. దీంతో జిల్లాలోని బీడు భూములకు సాగునీరు అందుతోంది. దీంతో పాలమూరు రైతు కళ్లలో ఆనందం తొనికిసలాడుతోంది.

ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టిన మంత్రి..
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులను గుర్తుచేసుకుంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, పాలమూరు జిల్లా వాసి నిరంజన్‌రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. ‘ఈ కన్నీళ్ల వెనక తెలంగాణ కష్టాలున్నయి. సమైక్య రాష్ట్రంలో దగా పడ్డ మా బతులున్నయ్‌.. పక్కన్నే కృష్ణమ్మ పారుతున్నా.. వలపోయిన పాలమూరు వెతలున్నయ్‌.. గుక్కెడు నీళ్లు దొరక్క తల్లడిల్లిన క్షణాలున్నయ్‌’ అని నాటి దుస్థితి యాది చేసుకున్నారు.

నాడు రోజూ చావులే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా అందులో పాలమూరు బిడ్డలు ఉండేవారని నిరంజన్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. పత్రికల్లో ప్రధాన సంచికల్లో పాలమూరు వలసలపై కథనాలు వచ్చేవన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఓసారి పాలమూరు బిడ్డలు చనిపోయిన ఘటన వార్త పత్రికల్లో రాలేదు. ఈ విషయాన్ని నాటి ఉద్యమనేత, మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్న కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. అయితే ఆ వార్త జిల్లా సంచికలో వచ్చిందని కేసీఆర్‌ తనకు చెప్పాడని వెల్లడించారు. నాటి నుంచి జిల్లా సంచికను కూడా చూడడం ప్రారంభించానన్నారు. ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకోవడం కూడా ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు.