కాంగ్రెస్ లోని సీనియర్ నేతలైన వీహెచ్ హన్మంతరావు.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధిష్టానంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. వీహెచ్ అయితే ఏకంగా అభిప్రాయ సేకరణ చేపట్టిన మాణికం ఠాకూర్ పైనే పలు ఆరోపణలు గుప్పించారు.
మాణికం ఠాకూర్ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాకరేపాయి. వీహెచ్ వ్యాఖ్యలను అధిష్టానం సైతం సీరియస్ గా తీసుకొని షోకాజ్ నోటీసు జారీ చేసింది.
తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క సైతం పీసీసీ ఎంపికపై సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన తన అభిప్రాయాన్ని పీసీసీ ఎంపికలో తీసుకోకుండా అవమానించారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేల మీటింగ్కు పిలిచి నన్ను వేరుచేసి చూశారని తెలిపారు. తన అభిప్రాయం చెప్పిన తర్వాత దూరం పెట్టాల్సిందని వాపోయారు. టీపీసీసీ విషయంలో ఏకాభిప్రాయం సాధ్యంకాదని ఆమె తేల్చిచెప్పారు.
తాను కోరుకున్న వారికి టీపీసీసీ పదవి వచ్చినా.. రాకున్నా పార్టీలో ఉంటానని ఆమె స్పష్టం చేశారు. పీసీసీ విషయంలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని ఎమ్మెల్యే సీతక్క అభిప్రాయపడ్డారు. తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు.