మధ్యప్రదేశ్ లో నేటి రాత్రి మరోమారు బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. సీనియర్ బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
22 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు తిరుగుబాటు చేసి, తమ పదవులకు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడటం, ముఖ్యమంత్రి కమలనాథ్ రాజీనామా చేయవలసి రావడం తెలిసిందే.
పార్టీలో బలమైన ఓబిసి నేతగా, మంచి పరిపాలన దక్షుడిగా పేరొందిన చౌహన్ ను తప్పించి గోపాల్ భార్గవ, నరేంద్ర తోమర్, థావర్ చంద్ గెహ్లాట్, నరోత్తం మిశ్రా వంటి వారిలో ఒకరిని ముఖ్యమంత్రిగా చేయాలని ఉదయం నుండి ప్రయత్నాలు జరిగినా చివరికి పార్టీ అధిష్ఠానం వెనుకడుగు వేసిన్నట్లు తెలుస్తున్నది.
ముఖ్యంగా ప్రభుత్వం నిలబడాలి అంటే రాజీనామా చేసిన 22 మంది స్థానాలతో పాటు, ఖాళీగా ఉన్న మరో రెండు స్థానాలకు జరిగే ఉపఎన్నికలలో బీజేపీ దాదాపు అన్నింటిని గెలుపొందవలసి ఉంది. లేని పక్షంలో ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది.
పైగా, బొటాబొటి ఆధికత్యలో ఉన్న శాసనసభలో బీజేపీ నుండి వలసలు వెళ్లకుండా కూడా కట్టడి చేయవలసి ఉంది. అందుకు బలమైన పునాది ఉన్న చౌహన్ మాత్రమే సమర్థులు కాగలరని `పెద్దలు’ పార్టీ అధిష్టానాన్ని వారించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న వారెవ్వరికి పార్టీపై గాని, ప్రజలలో గాని పట్టు లేకపోవడం తెలిసిందే.
ఈ రోజు సాయంత్రం బీజేపీ శాసనసభపక్షం భోపాల్ లో సమావేశమై లాంఛనంగా చౌహన్ ను తమ నాయకుడిగా ఎన్నుకొని, గవర్నర్ లాల్జీ టాండన్ కు తెలుపనున్నారు. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు రాజ్ భవన్ లో ఆయన ప్రమాణస్వీకారం చేయగలరని బిజెపి వర్గాలు తెలిపారు.