AP Minister : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రికి ఘోర పరాభవం ఎదురైంది. జీతాలు చెల్లించడం లేదంటూ ఏకంగా మంత్రి ఛాంబర్ కు సిబ్బంది తాళాలు వేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చర్చకు కారణమైంది. ఈ విషయం తెలిసి అధికార వైసీపీలోని కీలక నేతలు కూడా షాక్ కు గురయ్యారు. మంత్రి చాంబర్ కు తాళం వేయడానికి గల కారణాలు.. దాని వెనుకున్న వ్యవహారమేమిటో మీరూ చూడండి.
సాధారణంగా బిల్లులు చెల్లించలేదంటూ గ్రామాల్లోని సచివాలయాలకు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేస్తూ ఉండడం చూస్తుంటాం. కానీ, ఆంధ్రప్రదేశ్ లో జీతాలు చెల్లించ లేదంటూ ఏకంగా ఒక మంత్రి కార్యాలయానికి అక్కడ పనిచేసే సిబ్బంది తాళాలు వేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని సెక్రటేరియట్ లో చోటు చేసుకోగా, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పిఆర్ శాఖామంత్రిగా వ్యవహరిస్తున్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఈ పరాభవం ఎదురయింది. ఏపీ సెక్రటేరియట్ లోని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేషీకి సిబ్బంది తాళం వేసి మూసి వేశారు. సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఈ పని చేయడం గమనార్హం.
ఎనిమిది నెలలుగా జీతాలు లేకపోవడంతో తాళాలు..
ఈ శాఖ పరిధిలో పని చేస్తున్న సిబ్బందికి ఎనిమిది నెలలుగా జీతాలు లేవంటూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఈ పని చేశారు. డిసెంబర్ నెల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులకు హాజరు కావడం లేదు. ఇప్పుడు ఏకంగా మంత్రి పేషీకి తాళం కూడా వేసి తమ నిరసనను తెలియజేశారు. సాధారణంగా మంత్రి పేషీ రోజూ తెర్చుకునేది. అధికారులు సిబ్బంది వచ్చి తమ విధులను నిర్వర్తించేవారు. అయితే, ఎనిమిది నెలలుగా జీవితాలు కూడా చెల్లించకపోవడంతో మనస్థాపానికి గురైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. మంత్రి చాంబర్ కు తాళం వేశారు. జీతాలు విషయం గురించి అధికార యంత్రాంగానికి, మంత్రికి ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం స్పందించకపోవడంతో ఉద్యోగులు తీవ్రమైన మనస్థాపానికి గురై ఈ పని చేసినట్లు తెలుస్తోంది. తొమ్మిది నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో తాము ఎలా బతకాలో అర్థం కావడం లేదని, ఇప్పటికైనా తమ ఆవేదనను అర్థం చేసుకోవాలంటూ ఈ సందర్భంగా ఉద్యోగులు పేర్కొన్నారు.
విధులకు హాజరయ్యేది లేదంటూ స్పష్టం..
జీతాలు చెల్లించక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తాము మరో దారి లేక విధులకు హాజరు కావడం మానేశామంటూ సదరు ఉద్యోగులు పేర్కొన్నారు. శుక్రవారం విధులకు వచ్చిన పలువురు సిబ్బంది ఇకపై డ్యూటీకి వచ్చేది లేదని అధికారులకు సమాచారాన్ని అందించారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. సోమవారం మంత్రి చాంబర్ కు తాళం వేసి వెళ్లిపోయారు. మంత్రి పేషీకి వేసిన తాళం ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతో పని చేయడానికి వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విధులు నిర్వహించే పరిస్థితి ఉద్యోగులకు ఏర్పడింది. ఏకంగా సెక్రటేరియట్ లోని మంత్రి పేషీ మూతపడడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మంత్రి ఛాంబర్ కు తాళం వేయడంతో అక్కడ పని చేయాల్సిన అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిపాలనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఆగిపోయాయి. దీంతో అధికారులు మంత్రి క్యాంప్ ఆఫీసులో ఎక్కడ వీలైతే అక్కడ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంపై మంత్రితోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.